అరెస్టు సవాల్ పిటిషన్పై 29తర్వాతే విచారణ
విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడాన్ని ఇటీవల ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం.. ఈడీకి నోటీసులు జారీ చేసింది.
దీనిపై ఏప్రిల్ 24లోగా తమ స్పందన తెలియజేయాలని ఈడీని ఆదేశించింది. పిటిషన్పై ఏప్రిల్ 29 తర్వాత విచారణ నిర్వహిస్తామని వెల్లడించింది. లిక్కర్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయగా, ఆయనకు 15రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో తీహార్లో జైలులో ఉన్నారు. సోమవారంతో కస్టడీ ముగియనుండటంతో సీఎం కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపర్చారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున సీఎంను మరికొన్ని రోజుల పాటు కస్టడీలోనే ఉంచాలని ఈడీ కోర్టును కోరింది. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం కేజ్రీవాల్కు ఏప్రిల్ 23 వరకు కస్టడీని పొడిగించింది. దీంతో ఆయన అప్పటి వరకు తీహార్ జైలులోనే ఉండనున్నారు.