CONGRESS | TPCC |
KCR దిష్టిబొమ్మల దగ్ధానికి టీపీసీసీ పిలుపు
విధాత: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతుందని టీ పీసీసీ ఆరోపించింది. అయితే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన రాజకీయాల వ్యవహారాల కమిటీ (పిఏసీ) లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు నిర్ణయించడం జరిగింది.
ఈ నెల 22వ తేదీన అన్ని నియోజక వర్గ కేంద్రాలలో దశాబ్ది దగా పేరుతో కేసీఆర్ దిష్టి బొమ్మను రావణాసురుడిలాగా తయారు చేసి పది తలలు ఏర్పాటు చేసి తలలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి భారీ ప్రదర్శన తీసి దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది. అనంతరం ఆర్డీవోకు గాని, ఎమ్మార్వోకు గాని వినతి పత్రాలు అందించాలని పార్టీ సూచించింది.
ఈ కార్యక్రమాలు చాలా పెద్దఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చింది. ఆయా పథకాల బాధిత ప్రజలు ఆ నిరసన ప్రదర్శనలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలోని నాయకులంతా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేయాలి అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.
1. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య
2.ఫీజ్ రీయంబర్స్ మెంట్
3.ఇంటికో ఉద్యోగం
4. నిరుద్యోగ భృతి
5.పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
6.దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి
7.పోడు భూములకు పట్టాలు
8. రైతు రుణ మాఫీ
9. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు
10. 12 శాతం గిరిజన రిజర్వేషన్లు
అరెస్టులు అప్రజాస్వామికం: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరితో కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తున్న విషయం వాస్తవం కాదా అని అన్నారు. ఇది ఖచ్చితంగా దశాబ్ది దగానే అని అన్నారు.
ముందస్తు అరెస్టులు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరని మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.