విధాత, వరంగల్: చిన్నారులు, పిల్లలపై అమానుష ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనల పరంపర పరిశీలిస్తే మనసుకు తీరని ఆవేదన కలుగుతుందని బాధ వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతీ ఒక్కరు అరికట్టాలని సూచించారు.
సోమవారం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన భారీ సభలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ నేచర్ అండ్ ఫ్యూచర్ అంశం పై కైలాష్ సత్యార్థి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సభకు వేలాది మంది పిల్లలు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్లానింగ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ పిల్లలపై అత్యాచారాలు అమానుష సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నాయని ఈ దురదృష్టకరమైన అంశాల పట్ల సామాజిక బాధ్యతతో స్పందించాలని కోరారు. బాలల బంగారు భవిష్యత్ కోసం వారి హక్కులను ప్రతీ ఒక్కరూ కాపాడాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం వల్ల కొంత ప్రగతి సాధ్యమైందని అన్నారు. చిన్నారుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయని అన్నారు. కోవిడ్ సమయంలో చిన్నారుల పై లైంగికదాడులు రెట్టింపు అయ్యాయని ఆందోళన వెలిబుచ్చారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సమన్వయంగా కృషి చేస్తేనే బాలలపై జరుగుతున్న ప్రమాదాలను నివారించగలమని చెప్పారు. బాలలపై జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల గురించి ఎవరికి చెప్పాలొ? ఎవరిని ఆశ్రయించా? తదితర వివషయాలపై పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
బాలల హక్కుల దినోత్సవాలు జరగాలని, వారి హక్కులను కాపాడాలని చెప్పారు. పిల్లల మనస్తత్వం సున్నితంగా ఉంటుందని, వారిపై తల్లిదండ్రులు, సమాజం ప్రభావం గణనీయంగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి కేసులలో నిందితులు క్షమాపణ కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చిన్నారులకు, వారి కుటుంబ సభ్యులకు తక్షణమే నష్ట పరిహారంతో బాటు భద్రతకు భరోసా కల్పించాలని అన్నారు. బాధితులపై సమాజం చిన్న చూపు తగదని సూచించారు.
ముఖ్యంగా బాలికలకు సొంత కుటుంబ సభ్యుల మధ్యనే రక్షణ కొరవడింది అని అన్నారు. తమపై జరిగిన లైంగిక దాడులు, గురించి ఎవరికీ చెప్పకపోవడంతో ఆ ప్రభావం బాలికలపై దీర్ఘ కాలం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేపట్టిన భారత్ యాత్ర మంచి ఫలితాలు ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, రాజీవ్ గాంధీ హనుమంతు, డా.గోపి, పోలీస్ కమిషనర్ రంగనాథ్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావీన్య, కూడా ఛైర్మెన్ సంగం రెడ్డి సుందర్ రాజ్, అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు.