Minister Gangula
విధాత: బీసీలకు రూ. లక్ష ఆర్థిక సాయం దరఖాస్తుల గడువు పెంచేది లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మంత్రి గంగుల ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామన్నారు.
నేటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన లబ్దిదారులకు జులై 15వ తేదీన చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. అయితే బీసీ రుణాల పంపిణీ నిరంతరం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. ఆర్థిక సాయానికి మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామన్నారు. మరో విడత దరఖాస్తులకు మరో గడువు తేదీ ఉంటుందని గంగుల కమలాకర్ తెలిపారు.
బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ ఒక్కటే..
ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉంటాయి.. తమ పని తాము చేసుకుంటూనే ఉంటాం అని కమలాకర్ స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం పని చేయమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విలువ మున్సిపల్ ఎన్నికల్లోనే బయట పడ్డదని, కనీసం ఒక్క కార్పోరేటర్ను కూడా పొన్నం గెలిపించుకోలేకపోయారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు.
బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ ఇద్దరూ ఒక్కటే అని, తనమీద ఇద్దరూ కలిసి కేసులు వేశారని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలు తన మీద విచారణ చేసినా.. ఏమీ తేలలేదని అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎంఐఎం మాత్రమే కాదు.. తన మీద కేఏ పాల్, షర్మిల కూడా పోటీ చేయొచ్చని అన్నారు. తన పని తాను చేసుకుంటానని, తన జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని గంగుల కమలాకర్ హెచ్చరించారు.