విధాత: దేశంలో మరో వంద వెబ్సైట్లను కేంద్ర ఐటీశాఖ బ్లాక్ చేసింది. వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, టాస్క్ ఆధారిత పార్ట్టైమ్ జాబ్ మోసాలకు కేంద్రంగా ఉన్న 100 వెబ్సైట్లను నిషేధించాలన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు ఐటీశాఖ ఈ చర్యలు చేపట్టింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 కింద ఆ వెబ్సైట్లను బ్లాక్ చేసినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక నేరాలకు సంబంధించి వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడిని సులభతరం చేసే ఈ వెబ్సైట్లు విదేశీ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలినట్టు వెల్లడించింది. కార్డ్ నెట్వర్క్, క్రిప్టోకరెన్సీ, అంతర్జాతీయ ఫిన్టెక్ కంపెనీలను ఉపయోగించి పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపింది. ఈ సంవత్సరం ప్రారంభంలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్, అనధికార లోన్యాప్లతో చైనాసహా విదేశీ సంస్థలచే నిర్వహించబడే 232 యాప్లను కూడా ఐటీశాఖ నిషేధించింది.