High Court
హైదరాబాద్, విధాత: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదు..? ఓఎంఆర్ షీట్పై హాల్ టికెట్ నెంబర్, ఫొటోలు ఎందుకు లేవు అని తెలంగాణ హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ను ప్రశ్నించింది.
బుధవారం ముగ్గురు గ్రూప్-1 అభ్యర్థులు ఈనెల 11 నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓఎంఆర్ షీట్పై అభ్యర్థుల ఫొటోలు, హాల్ టికెట్ నెంబర్లు లేకుండానే పరీక్ష నిర్వహించారని, ఇది అనుమానాస్పదంగా ఉందని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం ఉన్నత ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఓఎంఆర్ షీట్పై అభ్యర్థుల ఫొటో, హాల్టికెట్ నెంబర్ లేకుండా పరీక్ష ఎలా నిర్వహిస్తారని టీఎస్పీఎస్సీని ప్రశ్నించింది. అక్టోబర్లో నిర్వహించిన మాదిగానే ఈసారి పరీక్షను ఎందుకు నిర్వహించలేదని మండిపడింది. పరీక్షల్లో అక్రమాలు నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని ప్రశ్నించింది. దీంతో కమిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పరీక్షల ఏర్పాట్లు అనేది టీఎస్పీఎస్సీ విచక్షణ అధికారమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
విద్యార్థుల బయోమెట్రిక్, ఓఎంఆర్ షీట్పై ఫొటో అనేది ఖర్చుతో కూడుకున్నదని, దీనికి సుమారు రూ.1.50 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అందుచేత ఆధార్ వంటి గుర్తింపు కార్డు ద్వారా ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ధృవీకరించారని తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష చాలామంది రాసినప్పటికీ ఏర్పాట్లపై ముగ్గురు అభ్యర్థులు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్నారు.. కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటిఅప్పుడు విద్యార్థుల నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేశారని టీఎస్పీఎస్సీ తరుపు న్యాయవాదిని హైకోర్టు అడిగింది. పరీక్షల విషయంలో ఖర్చులు ముఖ్యం కాదని పేర్కొంది.
పరీక్షలు పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( టీఎస్పీఎస్సీ) బాధ్యత కాదా అని వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలు ఇచ్చేందుకు 3 వారాల్లోగా కౌటర్ దాఖలు చేయాలని టీఎస్ పీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.