విధాత: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో కొండ పరిసరాలు క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.
ఎండను రద్దీని సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని స్వామివారిని దర్శించుకుని పులకించారు. గర్భాలయంలో స్వామివారికి నిత్యారాధన, అభిషేకాలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణోత్సవాలు వైభవంగా సాగాయి. భక్తులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని సేవించి తరించారు.
ఆదివారం స్వామివారి ఒకరోజు ఆదాయం 64 లక్షల 46వేల 277 రూపాయలు వచ్చిందని ఈవో గీతారెడ్డి తెలిపారు. స్వామివారిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మెంబర్, సెక్రటరీ (టెక్నికల్ ) మహాబీర్ సింగ్ కుటుంబ సమేతముగా దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కె. రఘోత్తంరెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు.