Jack Ma
ఇస్లామాబాద్ : అలీబాబా సంస్థ అధినేత చైనాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జాక్ మా ఆకస్మికంగా పాకిస్థాన్లో పర్యటించారు. జూన్ 29న జాక్ మా లాహోర్ చేరుకొన్నారని, 23 గంటలు అక్కడే ఉన్నారని పాకిస్థాన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ (బీవోఐ) మాజీ చైర్మన్ మహమ్మద్ అఫ్జర్ ఏహసాన్ తెలిపారు. అయితే.. ప్రభుత్వ అధికారులతోకానీ, మీడియాతోకానీ జాక్ మా ఎలాంటి చర్చలు జరపలేదని సమాచారం. ఒక ప్రైవేట్ నివాసంలో బస చేశారని తెలుస్తున్నది.
జాక్ మా ఎందుకు పర్యటనకు వచ్చారనేది అధికారికంగా వెల్లడికాకున్నా.. ఆయన పర్యటన భవిష్యత్తులో పాకిస్థాన్కు లాభం చేకూర్చవచ్చని ఏహసాన్ అన్నారు. ఏడుగురు వ్యాపార వేత్తల బృందంతో జాక్ మా పాకిస్థాన్కు వచ్చారని, అందులో ఐదుగురు చైనీయులు ఉంగా మరొకరు డెన్మార్క్, మరొకను అమెరికన్ ఉన్నారు.
అయితే.. జాక్ మా పర్యటన సామాజిక మాధ్యమాల్లో అనేక చర్చలకు తావిచ్చింది. పాకిస్థాన్లో ఉన్న వ్యాపార అవకాశాలను పరిశీలించడానికే ఆయన వచ్చారని పలువురు భావిస్తున్నారు. వివిధ వ్యాపార కేంద్రాలవారి సమావేశాలు నిర్వహించడంతోపాటు.. ప్రముఖ వ్యాపార వేత్తలు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతోనూ ఆయన చర్చలు జరిపారని తెలుస్తున్నది.
ఈ సమావేశాలపై చైనా రాయబార కార్యాలయానికి కూడా సమాచారం లేదని ఎహసాన్ తెలిపారు. పాషా చైర్మన్ జహీర్ ఖాన్ ఒక వార్తా పత్రికతో మాట్లాడుతూ.. జాక్ మా పర్యటన ఆయన వ్యక్తిగతమని, అయితే, పాకిస్థాన్ టూరిజానికి ఆయన పర్యటన దోహదపడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పాకిస్తాన్ ఐటీ రంగంలో ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు పాక్ అధికారవర్గాలే ఈ పర్యటనను ఏర్పాటు చేసి ఉంటాయని అభిప్రాయపడ్డారు.
జాక్ మా పర్యటన పాకిస్థాన్కు భారత్తో ఉన్న భౌగోళిక, రాజకీయ సంబంధాలతో కూడా జోడించి చూడాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే భారత్, పాక్ సంబంధాలు బెడిసికొట్టి ఉన్నాయి. చైనా, భారత్ మధ్య కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో చైనా, పాక్ సంబంధాల పటిష్ఠతకే జాక్ మా పాకిస్థాన్లో పర్యటించి ఉంటారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.