విధాత: మనిషి బతికేందుకు ఆక్సిజన్ ఎంత అవసరమో.. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థకు కేసీఆర్ కూడా అంతే అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నాయని తెలిపారు. దేశ ప్రజలు భారత రాష్ట్ర సమితిని అక్కున చేర్చుకుంటున్నారని తేల్చిచెప్పారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, మోర్తాడ్ మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన వార్డు సభ్యులు, నాయకులు, యూత్ సభ్యులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ఎంతవరకైనా కొట్లాడుతారని, ఆయన వ్యక్తి కాదు ఓ శక్తి అని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్లతో ప్రజలు విసిగిపోయారని పేర్నొన్నారు.
కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేయాలనే ఆలోచనతో కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని అధోగతి పాలు చేస్తుందని ఆరోపించారు.