కుమారి ఆంటీ షాపు రీ ఓపెన్..సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
కుమారి ఆంటీ షాపు తొలగింపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమెపై పెట్టిన పోలీస్ కేసును పునఃపరిశీలన చేయాలని డీజీపీకి సీఎం రేవంత్రెడ్డి సూచించారు

విధాత : స్ట్రీట్ ఫుడ్ అందించే కుమారి ఆంటీ షాపు తొలగింపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమెపై పెట్టిన పోలీస్ కేసును పునఃపరిశీలన చేయాలని డీజీపీకి సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎంఏయూడి అధికారులను ఆదేశించారు. కుమారి పాత స్థలంలోనే వ్యాపారాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన అంటే ఎంటర్ ప్రెన్యూర్స్కు బాసటగా నిలవడమని సీఎం పీఆర్వో అయోధ్య రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. కుమారి అంటీ స్ట్రీట్ ఫుడ్స్ షాపు సోషల్ మీడియాలో ఫేమస్ కాగా, ఆమె షాపు మూలంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, షాపుకు అనుమతుల్లేవంటూ మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు మూసి వేయించారు.
గుడివాడకు చెందిన కుమారి అనే మహిళ తన భర్త, పిల్లలతో కలిసి హైదరబాద్కు జీవనోపాధి కోసం వచ్చింది. రోడ్డు పక్కన తక్కువ ఖర్చుతో నాణ్యమైన భోజనం అందించే స్టాల్ పెట్టుకోగా, భర్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కుమారి ఆంటీ అందించే భోజనం నాణ్యతగా, తక్కువ ఖర్చుతో ఉండటంతో ఆమె ఫుడ్ స్టాల్ వేగంగా పేరు తెచ్చుకోగా, యూ ట్యూబ్ చానళ్ల ఇంటర్య్వూలతో అమె ఫుడ్ స్టాల్ మరింత పాపులర్ అయ్యింది. అయితే మంగళవారం ఆమె షాపును ట్రాఫిక్ పేరుతో తెలంగాణ పోలీసులు మూసివేసి మరోచోట పెట్టుకోవాలని ఆదేశించారు. ఇందుకు ట్రాఫిక్ కారణం కాదని, ఆమె యూట్యూబ్ ఇంటర్య్వూలో తనకు ఏపీలో జగనన్న ఇల్లు కట్టించి ఇచ్చాడని, చాల సంతోషంగా ఉందని చెప్పడమే కారణమైందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అమె చెప్పిన మాటలు జగన్కు అనుకూలంగా ఉండటం నచ్చని టీడీపీ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పి ఆమె ఫుడ్ స్టాల్ మూసివేయించారని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. అయితే సీఎం రేంవత్ రెడ్డి ఈ వివాదంపై స్పందించి కుమారి ఆంటీ షాపును యధావిధిగా కొనసాగించాలని ఆదేశించడంతో పాటు తాను స్వయంగా షాపుకు వస్తానని చెప్పడంతో ఆమె మరింత పాపులర్గా మారిపోయింది.