LPG Price | నూతన సంవత్సరం సందర్భంగా ఆయిల్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించాయి. ధరలను పెంచే సమయంలో భారీగా పెంచే కంపెనీలు.. అతి స్వల్పంగా తగ్గించడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. సోమవారం చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరలను రూపాయిన్నర మాత్రమే తగ్గించాయి. దేశీయ ఎల్పీజీ ధరలను మాత్రం ఆయిల్ కంపెనీలు యథాతధంగా కొనసాగించాయి. 19 కిలోల సిలిండర్పై కేవలం రూ.1.50 మాత్రమే తగ్గించాయి. దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1755.50కి తగ్గింది. కోల్కతాలో రూ.1,869, ముంబయిలో రూ.1,708.50, చెన్నైలో రూ.1924.50కి తగ్గాయి. హైదరాబాద్లో రూ.2,007.50కి చేరింది.
ఈ ఏడాది లోక్సభలు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలను తగ్గించబోతుందనే వార్తలు వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలోనూ పెట్రోల్ కంపెనీలు నూతన సంవత్సరం సందర్భంగా ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ ధరలు చివరిసారిగా గత ఆగస్టులో తగ్గాయి. ప్రస్తుతం సిలిండర్ ఢిల్లీలో రూ.903 అందుబాటులో ప్రస్తుతం హైదరాబాద్లో రూ.955గా ఉన్నది. గతేడాది ఆగస్టు 30న సిలిండర్ ధరలు రూ.200 వరకు దిగివచ్చాయి. అయితే, గ్యాస్ ధరలు కొండంత పెంచుతున్న కంపెనీలు.. తక్కువ మొత్తంలో తగ్గించడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.