- CPM పార్టీ ఆధ్వర్యంలో స్థలాలు ఆక్రమించిన దాదాపు వెయ్యి మంది నిరుపేదలు
- రెవెన్యూ అధికారులకు అర్జీలు పెట్టి విసిగి పోయామని ఆవేదన
విధాత, అదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ శివారులో గల ప్రభుత్వ ఖాళీ స్థలాలలో సిపిఐ ఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు జెండాలు పాతుకుని ఇంటి స్థలాలను ఆక్రమించుకున్నారు. తమకు ఇళ్ల స్థలాలు అధికారికంగా ఇచ్చేంత వరకు ఇక్కడి నుండి వెళ్లేది లేదంటూ 1000 మంది ఇంటి స్థలాలను ఆక్రమించుకుని కూర్చున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిన హామీని తొమ్మిది సంవత్సరాలుగా అమలు చేయలేదని వాపోయారు.
ఇప్పటికైన ఇచ్చిన హామీ మేరకు మాలాంటి గూడు లేని నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేసిందని పేర్కొన్నారు.
రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలమైన మాకు నిలువ నీడ లేదని వాపోయారు. కూలి పనికి పోయి తెచ్చిన డబ్బులు అద్దె ఇండ్ల కిరాయికి సరిపోతున్నాయని, ఇక తినడానికి తిండి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కాని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కాని కేటాయించాలని డిమాండ్ చేశారు.