Minister Gangula Kamalakar
విధాత: విదేశీ యూనివర్సిటీలతో పాటు దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీల సహా 200లకు పైగా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు పూర్తి ఫీజు(ఆర్టీఎఫ్)ను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని మంగళవారం బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు.
గతంలో మన రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదని ఈ విద్యా సంవత్సరం నుంచి బిసిలకు అందజేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10వేల మంది బిసి విధ్యార్థులకు లబ్దీ చేకూరుతుందని, ఇందుకోసం అదనంగా ఏటా రూ.150కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు.
ఇప్పటికే అంతర్జాతీయంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బిసి విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్పులతో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రియింబర్స్మెంట్ ఇస్తున్నామని, ఇక నుండి దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లోని బిసి బిడ్డలకు సైతం పూర్తి ఫీజు అందించడంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బిసి విద్యార్థులకు పూర్తి ఫీజుల్ని చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణనే అని మంత్రి గంగు అన్నారు. బిసి బిడ్డలకు ఎస్సీ, ఎస్టీల మాదిరి ఫీజు అందించడం సంతోషంగా ఉందన్న మంత్రి గంగుల ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేశారు.