విధాత : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అంతా రబ్బిష్ అని, వాటిని చూసి కంగారు పడాల్సిన పని లేదని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ అధికారం బీఆరెస్ పార్టీదేనని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈరకమైన ఎగ్జిట్ పోల్స్ను గతంలోనూ చూశామని, ఎగ్జిట్ పోల్స్ తప్పు అని నిరూపించడం మాకు కొత్తేమీ కాదన్నారు. అసలైన ఫలితం డిసెంబర్ 3న వస్తుందని, 70కి పైగా స్థానాలతో విజయం సాధిస్తామన్నారు. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండా ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్ని గొప్పగా చేసి చూపిస్తారని, గతంలో 2018లో 5 మీడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒక్కటే నిజమైందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఒక పక్క ప్రజలు ఇంకా పోలింగ్ కేందాల్లో క్యూలైన్లలో ఉండి ఓట్లు వేస్తూండగానే ఇంకోపక్క అప్పుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడటమేంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అస్సలు ఏ లాజిక్తో ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందన్నారు. ఒకవేళ డిసెంబర్ 3న ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే.. తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని ఎగ్జిట్ పోల్స్ ప్రచురించిన మీడియా సంస్థలను ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను ఎగ్జిట్ పోల్స్ తో అయోమయానికి గురిచేయాలని చేసిన ప్రయత్నం ఫలించదన్నారు.
ఎవ్వరూ కన్ఫ్యూజన్ కావద్దని.. వందకు 100 శాతం అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. గత 90 రోజులుగా కష్టపడ్డ మా కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.తన ప్రెస్మీట్ సమయానికి ఇంకా గంట, గంటన్నర సేపు పోలింగ్ జరిగేది ఉందని.. 70కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ఇంకా పోలింగ్ శాతం తేలలేదని.. ఫైనల్ పోలింగ్ శాతం ఎంతన్నది శుక్రవారం ఉదయం తేలుతుందని తెలిపారు. ఎంత పోలింగ్ అయ్యింది.. ఎక్కడ ఎంత అయ్యింది.. ఏ నియోజకవర్గంలో ఎంత అయ్యిందనేది విశ్లేషించుకుని చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఎన్నికల క్యూ లైన్ లో ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వారివి ప్రభావితం అయ్యేలా నిర్ణయం తీసుకోవడంపై ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవోతో మాట్లాడితే ఎన్నికల కమిషన్ నిబంధనలు అలాగే ఉన్నాయని చెప్పారని, పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న నిబంధనలను మారిస్తే బాగుంటుందన్నారు. భవిష్యత్తులోనైనా ఈ అంశం పైన దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. దుష్ప్రచారాలు, అబద్ధాలు, నకిలీ వీడియోలతో ప్రజలను ప్రభావితం చేసేలా పని చేస్తున్న పార్టీలపైన, సంస్థలపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడం పైన ఆలోచించాలని కేటీఆర్ కోరారు.