విధాత : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పిదప బీఆరెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐ పాస్, బీ పాస్ వంటి సింగిల్ విండో విధానాలతో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. గత పదేండ్లలో ప్రభుత్వ రంగంలో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 42 వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి. మా కంటే మెరుగ్గా ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా..? ఉంటే తెలంగాణ పిల్లలకు చెప్పండి. ఊరికే గావుకేకలు, పెడబొబ్బలు కాదు. ఈ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వండి. ఫలానా చోట ఇంత కన్న ఎక్కువ చేశామని చెప్పండి. గుజరాత్లో 6 కోట్ల జనాభా ఉంది. రాజస్థాన్లో ఎనిమిదిన్నర కోట్లు, కానీ ఈ రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ అనుకున్నంత జరగలేదు.
మనం 4 కోట్ల జనాభాకు 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఎనిమిదిన్నర కోట్లు, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదు. వాళ్లొచ్చి మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఇవి వాస్తవాలు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్సైట్ కూడా పబ్లిష్ చేశాం. వాస్తవాలు ఇవి. కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా..? ప్రయివేటు సెక్టార్లో కూడా లక్షల ఉద్యోగాలు సృష్టించి, ఉపాధి కల్పించాం.
గతంలో తెలంగాణలో ఒక రైతు భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే చేయి తడపనిదే రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు. అంతేకాదు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతదో, మ్యుటేషన్ ఎప్పుడు అయితదో తెలవని పరిస్థితి. మన చేతుల్లో ఏం ఉండేది కాదు. వాళ్ల దయ మన ప్రాప్తం. ధరణి వచ్చిన తర్వాత అన్ని లేయర్స్ పోయాయి. వీఆర్వో, వీఆర్ఏ, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ, రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టర్ ఇలా ఎనిమిది లేయర్స్ తీసేశాం. ధరణి ద్వారా రైతుల వేలి ముద్రకు అధికారం ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్.
మీ భూమి రికార్డును ఎవరూ ట్యాంపర్ చేయకుండా మీకు అధికారం ఇచ్చారు. ధరణి తీసుకొచ్చింది కేసీఆర్. ధరణిలో లోటుపాట్లు ఉండొచ్చు. మేం లేవు అనట్లేదు. కానీ ఇవాళ భూమాత అని తెస్తున్నారు. తిరిగి పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని చెబుతున్నారు. పట్వారీ వ్యవస్థ అంటేనే దళారీ వ్యవస్థ. పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చిన వారిని ఆశీర్వదిద్దామా.? లేదా ధరణి తెచ్చి, భూముల రిజిస్ట్రరేషన్లో పారదర్శకత తెచ్చిన వారిని ఆశీర్వదిద్దామా ప్రజలు ఆలోచించాలి.
టీఎస్ ఐపాస్, టీఎస్ బీ పాస్ మీకు తెలుసు. ఈ రెండింటి ద్వారా సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. కొత్త మున్సిపాలిటీ, కొత్త పంచాయతీ చట్టాలను తెచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నాం. టీఎస్ ఐపాస్ ద్వారా 24 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 24 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది.
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ చిరునామాగా మారింది. గూగుల్, ఆపిల్, అమెజాన్, మెటా వంటి తదితర కంపెనీలకు నిలయంగా మారింది. ఐటీ ఎగుమతులు 57 వేల కోట్ల నుంచి 2.41 లక్షల కోట్లకు చేరాయి. ఐటీ ఉద్యోగాలు 3 లక్షల నుంచి 9 లక్షలకు చేరాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలైన వనపర్తి, నల్లగొండ, మహబూబ్నగర్, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్ వంటి పట్టణాలల్లో ఐటీ కంపెనీలు నెలకొల్పాం. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది.
హైదరాబాద్ నగరంలో ఎస్సార్డీపీ కింద 19 ఫ్లైఓవర్లు, ఐదు అండర్పాస్లు, 7 ఆర్వోబీ, ఆర్యూబీ, కేబుల్ బ్రిడ్జి, స్టీల్ బ్రిడ్జి నిర్మించాం. మరో 12 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో వరదలను అరికట్టేందుకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాం. నగరంలో ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల నీళ్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు నగరంలో రోజు తప్పించి రోజు నీళ్లు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి రోజు, 24 గంటల పాటు మంచినీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఇది మా కల. 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను రాబోయే టర్మ్లో 250 కిలోమీటర్లకు చేయాలనుకుంటున్నాం. ఆపై టర్మ్లో 415 కి.మీ. తీసుకుపోవాలని అనుకుంటున్నాం.
తెలంగాణ వచ్చిన రోజు జీహెచ్ఎంసీలో 3500 టన్నుల చెత్తను సేకరించేది. ఇప్పుడు 7 వేల టన్నులకు పెరిగింది. మున్సిపాలిటీల్లో 2397 టన్నుల చెత్తను సేకరించేవారు. ఇప్పుడు 4295 టన్నులకు చేరుకుంది. 100 శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న నగరం భారతదేశంలో హైదరాబాద్ మాత్రమే. ఇన్నోవేషన్లో దేశంలోనే ముందు వరుసలో ఉన్నాం. మన పిల్లల కోసం ఉద్యోగార్థులగా మిగిలిపోవద్దు.. వారు పది మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేశాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్.
శాంతి భధ్రతలు పటిష్టం చేశాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టాం. షీ టీమ్స్, భరోసా సెంటర్లు ఏర్పాటు చేశాం. లక్షలాది కెమెరాలు వాడి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఒక సేఫ్ స్టేట్గా లా అండ్ ఆర్డర్ను ఇంత ఎఫిషియంట్గా మెయింటెన్ చేసిన రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే ఉంది.