25 మందితో స్పెషల్ ట్యాపింగ్ టీమ్
కేసులో పీపీ నియామకం
విధాత, హైదరాబాద్: పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి చుట్టు బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ పద్మవ్యూహామే అమలు చేసింది. రేవంత్రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, సన్నిహతుల ప్రతి కదలికలను పసిగట్టినట్లుగా ట్యాపింగ్ కేసు విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తుంది. రేవంత్ పీసీసీ చీఫ్గా నియామితులైనప్పటి నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆరెస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు డైరక్షన్లో 25మంది స్పెషల్ టీమ్ రేవంత్ కదలికలపై ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిఘా వేసి, ఆయన ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు.. ఎక్కడికి వెలుతున్నారు.
ఎవరెవరిని కలుస్తారన్న ప్రతి సమాచారాన్ని బీఆరెస్ ప్రభుత్వానికి అందించినట్లుగా ట్యాపింగ్ కేసులో నిందితులు విచారణలో విచారణలో వెల్లడించారన్న కథనాలు వెలువడుతున్నాయి. నిఘా బృందం కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహకారాలు అందిస్తున్న వారి వివరాలు తెలుసుకొని బీఆరెస్ ప్రభుత్వానికి సమాచారానికి చేరవేసేదని, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై కూడా నిఘా వేశారని నిందితులు విచారణలో చెప్పినట్లుగా పోలీస్ సర్కిల్లో లీకులు బయటకువచ్చాయి.
బీఆరెస్ ప్రత్యర్థిగా మారిన ఈటల రాజేందర్ పైన నిఘా పెట్టిన బృందం, హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసి, వారి రాజకీయ వ్యూహాలను, ఆర్ధిక వనరుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేరవేసినట్లుగా విచారణలో నిందితులు తమ వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఇచ్చిన సమాచారంతో కొనసాగుతున్న విచారణలో భాగంగా త్వరలోనే కొందరు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారని, బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించాలని దర్యాప్తు బృందం సన్నద్ధమవుతున్నారన్న ప్రచారం పోలీస్ వర్గాల్లో వినబడుతుంది.
అలాగే ధ్వంసమైన డేటా రిట్రీట్ కోసం ఐపీటీఆర్తో విచారణ బృందం ప్రయత్నిస్తుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించడం మరో కీలక పరిణామం. సీనియర్ న్యాయవాది సాంబశివ రెడ్డిని పీపీగా నియమిస్తూ ఉత్తర్వులు చేశారు. నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖాలు చేశారు.