విధాత: రాజస్థాన్లో పోలింగ్ ఏజెంట్ మరణించారు. జైపూర్లోని పాలి జిల్లాలో శనివారం ఓ అభ్యర్థికి చెందిన పోలింగ్ ఏజెంట్ గుండెపోటుతో మృతి చెందారు. మృతుడిని శాంతి లాల్గా గుర్తించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సుమేర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 47లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలింగ్ కేంద్రం వద్ద శాంతి లాల్ కుప్పకూలిపోయారు. ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించి, అనంతరం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకోగానే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు కారణంగా మరణించాడని తెలిపారు. మరణించిన పోలింగ్ ఏజెంట్ ఏ పార్టీకి చెందిన వాడనేది తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.