విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ గిరిజన జాతిని నిర్లక్ష్యం చేస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ గిరిజన విద్యార్థులు పోస్ట్ కార్డు ఉద్యమానికి సిద్ధమయ్యారు. తెలంగాణ గిరిజనులకు సంబంధించిన కీలక అంశాలైన 10 శాతం రిజర్వేషన్ను రాజ్యాంగ సవరణ చేసి ఆమోదించడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తున్నారు.
ములుగు జిల్లా జాకారంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలని కోరుతూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. గిరిజన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పాఠశాల మొదలుకొని యూనివర్సిటీ వరకు ప్రతి గిరిజన విద్యార్థి ప్రధానమంత్రికి పోస్ట్ కార్డు రాయాలని నిర్ణయించారు. ఈ రెండు అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వెంటనే ఆమోదించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ, గిరిజన విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డులు రాసి పంపారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల పోస్ట్ కార్డు ఉద్యమానికి సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రలోని గిరిజనులు నష్టపోకుండా 10 శాతం రిజర్వేషన్ అమలు చేసి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు.
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచడంతో విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అన్నారు. విభజన చట్టం 2014 ప్రకారం కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారామ్ నాయక్, బీ ఆర్ ఎస్ నాయకులు జాన్సన్ రాథోడ్, ప్రొఫెసర్ రమణ నాయక్, బీఆర్ఎస్ గిరిజన విద్యార్థి నాయకుడు శ్రీను నాయక్, వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.