విధాత: రెండు రోజుల క్రితం ఢిల్లీలొని తమిళనాడు భవన్ లో CBI అరెస్ట్ చేసిన నకిలీ అధికారి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ కేసులో.. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన్ను సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా మూడు రోజులుగా బొంతు ఫోన్ స్విచ్చాఫ్లో ఉండడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నది.
నాకు ఎలాంటి నోటీసులు అందలేదు: బొంతు రామ్మోహన్
సీబీఐ అరెస్టు వార్తలను హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఖండించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. గురువారం ఆయన బంజారాహిల్స్లోని కవిత నివాసం వద్దకు వచ్చారు. ఎవరో వచ్చి ఫొటో దిగితే నాకేం సంబంధంమని ఆయన ప్రశ్నించారు. మీడియాలో ఊహాగానాలు తప్పా ఎలాంటి వాస్తవం లేదన్నారు.
శ్రీనివాస్ అనే వ్యక్తిని ఒక ఫంక్షన్లో కలిశానని, అతనితో నాకు ఎలాంటి పరిచయం లేదన్నారు. నా ఫోన్ స్విచ్చాఫ్ వస్తే అరెస్ట్ చేసినట్లేనా? అని ప్రశ్నించారు. అనారోగ్యం కారణంగా ఫోన్ ఆఫ్లో పెట్టినట్లు తెలిపారు. తెలంగాణ నాయకులు ఒత్తిళ్లకు భయపడరని బొంతు స్పష్టం చేశారు.