విధాత: రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని జిల్లాలోని సుప్రసిద్ధ సూర్య దేవాలయాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలోని కృష్ణ తీరాన ఉన్న అడవిదేవులపల్లిలోని పంచాయాతన పామనగుండ్ల సూర్య దేవాలయం, నల్గొండలోని సుప్రసిద్ధ చారిత్రక పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, మూసితీరంలోని వలిగొండ త్రిశక్తి సూర్యదేవాలయాలు రథసప్తమి వేడుకలకు ముస్తాబయ్యాయి.
రథసప్తమి( మాఘశుద్ధ సప్తమి) ఏడు గుర్రాల బంగారు రథంతో దక్షిణాయన మార్గంలో పయనిస్తున్న సూర్యుడు మకర రాశి ప్రవేశంతో ఉత్తరాయణ గమనంలోకి మారే పర్వదినమే రథసప్తమిగా భావిస్తారు.
రథసప్తమి రోజున సూర్యుడి ఆరాధన మనిషిలోని పాపాలను ప్రక్షాళన చేసి పుణ్యఫలములను, ఆయురారోగ్య సంపదలను అందిస్తుందన్న విశ్వాసం భక్తులలో కొనసాగుతుంది.