విధాత: బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాసిన బహిరంగ లేఖలో పేర్కోన్నారు. శుక్రవారం ఆయన ఈ లేఖను విడుదల చేశారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్ది, ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయన్నారు.
అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను సైతం మోడీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులన్న ధోరణితో కక్షాపూరిత రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని, ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నది బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అని రేవంత్ విమర్శించారు.
కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుండి అందుతున్నాయి? వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివో ప్రజలు ఆలోచించాలని రేవంత్ కోరారు. గడచిన పదేళ్లలో మోడీ-షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కు మన్నది లేదని, కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలన్నారు. అమిత్ షా-కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించగా, పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం జరుగుతుందని ఆరోపించారు.
ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోందని, కేసీఆర్కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు ఎందుకు వెళ్లడ లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్ ను ప్రశ్నించవు..విచారించవని, కాని కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల, వివేక్ ఇళ్లపై, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారన్నారు. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా? అని రేవంత్ బీజేపీని నిలదీశారు.
పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై కూడా ఉందని, నేను బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నానని, మీ పతనం మొదలైందని, మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయని, వివేక్ వెంకట స్వామి కుటుంబంపై దాడి కాంగ్రెస్ పార్టీ పై జరిగిన దాడిగా భావిస్తామని, వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని రేవంత్ స్పష్టం చేశారు.