విధాత: మారాజా అంటే మరో రెండు దెబ్బలు వెయ్యమన్నాడట. అలా తయారైంది నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటున్న వెంకటగిరి నియోజకవర్గానికి ఆయన్ను కాదని నేదురుమల్లి రామ్ కుమార్ను నియమించిన పార్టీ అధిష్టానం ఇప్పుడు ఇంకో జెల్ల కొట్టింది. ఇప్పుడు ఆయనకు ఉన్న భద్రతను సైతం తగ్గించింది.
కొంతకాలంగా ఆయన తన సొంత ప్రభుత్వ పని తీరు పైన అసంతృప్తితో పలుమార్లు విమర్శలు చేయడం తెలిసిందే. తమ ప్రభుత్వ పనితీరు మీద మీటింగుల్లోనే విమర్శలు చేస్తున్నారు. ఈయన్ను ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోయి ఏదోటి మాట్లాడుతూ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని పార్టీ భావిస్తోంది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరి ఎమ్మెల్యేగా నియమించడం ద్వారా ఆనంకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా తానేమీ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదని ఆనం చెబుతున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాది కూడా లేదని.. గ్రామాల్లో సచివాలయాల నిర్మాణం వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని మాత్రమే కోరుతున్నానంటున్నారు.
అలాగే రోడ్లకు మరమ్మతులు చేయాలని సూచిస్తున్నారు. లేదంటే పథకాల రూపంలో డబ్బులించినంత మాత్రాన ప్రజలు ఓటేయరని మాత్రమే తాను చెప్పానంటున్నారు. చంద్రబాబు సైతం గత ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో రూ.10 వేల చొప్పున ఇచ్చినా ప్రజలు ఓడించారని గుర్తు చేస్తున్నారు. తాను ఇదే విషయాన్ని అధికారులకు కాంట్రాక్టర్లకు చెప్పి పనులు చేయాలని కోరుతున్నానని అంటున్నారు.
అయితే ఆనం వ్యాఖ్యలను వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఆయన్ను నియంత్రిస్తోంది. ఆయన వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో చేరి ఆత్మకూరు నుంచి బరిలోకి దిగుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆనంపై వేటు వేయకుండా ఆయనే అధిష్టానం పొగ బెడుతోంది. ఇందులో భాగంగా ఆనం భద్రతను తగ్గించారు.
ప్రస్తుతం ఆనంకు 2+2 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత కల్పిస్తుండగా.. దాన్ని 1+1కు కుదించడం గమనార్హం. ఇదిలా ఉండగా మరోవైపు అదే జిల్లాకు చెందిన ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు భద్రత పెంచడం గమనార్హం. ప్రస్తుతం అనిల్ కు 1+1 భద్రత ఉండగా.. ఆయన భద్రతను 2+2కు పెంచారు