రేపే కొత్త ఎమ్మెల్యేల ప్ర‌మాణం.. ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌స‌భ ప్రారంభం

తెలంగాణ మూడో అసెంబ్లీ శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు కొన‌సాగే శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి

  • Publish Date - December 8, 2023 / 12:36 PM IST

హైద‌రాబాద్ : తెలంగాణ మూడో అసెంబ్లీ శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు కొన‌సాగే శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. స‌మావేశం ప్రారంభం అనంత‌రం కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారం జ‌ర‌గ‌నుంది. నూత‌న స‌భ్యుల‌తో ప్రొటెం స్పీక‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు. ఈ స‌భ‌లో ప్రొటెం స్పీక‌ర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఒవైసీ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. శ‌నివారం ఉద‌యం 8:30 గంట‌ల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో అక్బ‌రుద్దీన్ ఒవైసీ చేత ప్రొటెం స్పీక‌ర్‌గా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌మాణం చేయించ‌నున్నారు.


తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నియమించిన సంగ‌తి తెలిసిందే. సీనియారిటీ ప్రకారం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంది. ఆయన 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ ఇవాళ ఆయన కాలు జారిపడటంతో గాయాలయ్యాయి.


దాంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఇక తర్వాత వరుసలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఉండగా, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో రేవంత్‌ సర్కారు అక్బరుద్దీన్ ఒవైసీ వైపు మొగ్గుచూపింది. ప్రభుత్వ వినతిని అక్బరుద్దీన్‌ స్వీకరించారు.