విధాత: దేశంలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్లను చేతులతో శుభ్రంచేస్తూ ఈ ఏడాది ఇప్పటి వరకు 49 మంది చనిపోయారు. గడిచిన ఐదేండ్లలో ఇలాగే 443 మంది మాన్యువల్ స్కావెంజర్స్ మరణించారు. ఈ విషయాన్ని లోక్సభలో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం లిఖితపూర్వంగా వెల్లడించింది.
మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్లను మాన్యువల్గా శుభ్రం చేస్తూ ఈ ఏడాది నవంబర్ 20 వరకు 49 మంది మరణించారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. అత్యధిక మరణాలు రాజస్థాన్లో 10 పది, గుజరాత్ 9 మంది, తమిళనాడు, మహారాష్ట్ర ఏడుగురు చొప్పన చనిపోయినట్టు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా మ్యాన్హోల్ క్లీనింగ్ రోబోల సంఖ్యపై తమ వద్ద ఎలాంటి డేటా లేదని పేర్కొన్నారు. వాటిని ఎక్కడ వినియోగిస్తారో కూడా తెలియని వెల్లడించారు. మాన్యువల్ స్కావెంజింగ్, ప్రమాదకర మురుగు కాలువల క్లీనింగ్ వల్ల మరణాలు, ప్రాజెక్టు స్థితిగతులపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అపరూప పొద్దార్ అడిగిన ప్రశ్నకు అథవాలే లిఖికపూర్వక సమాధానం ఇచ్చారు. మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్లను శుభ్రపరిచేందుకు యంత్రాలను వినియోగించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఇప్పటికే మాన్యువల్గా మనుషులను ఇందుకు వినియోగిస్తున్నారు.