Tollywood |
సినీ ప్రేక్షకులు చాలా ఆకలితో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత మళ్లీ ఆ రేంజ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో సినీ ప్రియులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. ఓ మంచి సినిమా ఎప్పుడు వస్తుందా సినీ ప్రియుల ఆకలి తీరుస్తుందా అని ఎదురు చూపులు చూస్తున్న సమయంలో మూడు పెద్ద చిత్రాలు నెల గ్యాప్తో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి.
ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. ‘పుష్ప : ది రైజ్’ చిత్రంలో బన్నీ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ సినీ అవార్డు దక్కడంతో ఇప్పుడు పుష్ప2పై అంచనాలు పీక్స్లో ఉన్నాయి.
ఈ ఏడాది డిసెంబర్లో పుష్ప2 వస్తుందని అందరు అనుకున్నారు. కాని వచ్చే ఏడాది మార్చి 22న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బన్నీ మూవీతోనే బాక్సాఫీస్ వార్ మొదలు కానుందని చెబుతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదల కాగా,దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అన్న ఆతృతతో ఫ్యాన్స్ ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఇక టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఎన్టీఆర్ దేవర చిత్రం ఒకటి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. 2024 ఏప్రిల్ 5న భారీ స్థాయిలో థియేటర్ల లోకి ఈ చిత్రం రానుంది. అంటే ‘పుష్ప2’ రిలీజ్ అయిన పదిహేను రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం దేవర. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టం ఖాయమని చెబుతున్నారు. ఇక నెల గ్యాప్ లోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా కల్కి 2898 ఏడీ చిత్రం థియేటర్స్లోకి రానుంది.
2024 జనవరి 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన వచ్చే ఏడాది మే 9న సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇలా తక్కువ గ్యాప్లోనే ఈ మూడు పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.