Site icon vidhaatha

V. Hanumantha Rao | త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘బీసీ గర్జన’ : వీహెచ్

V. Hanumantha Rao

విధాత: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సదస్సు నిర్వహించి అందులోనే పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని పీసీసీ మాజీ చీఫ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు వెల్లడించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారని, ఈ క్రమంలో బీసీ జనగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. అందుకే రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కూడా బీసీ గర్జనకు ఆహ్వానిస్తామన్నారు.

రాహుల్ గాంధీ కులజనగణన చేపడతామని హామీ ఇవ్వగానే అన్ని రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చిందన్నారు. బీసీల కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. నేడు బీసీ పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. బీసీ గర్జన ద్వారా బీసీ కులాలకు ఏం చేయాలనే దానిపై చర్చిస్తామన్నారు.

బీసీలకు న్యాయం కోసం పార్టీలో బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలని అధిష్టానంతో మాట్లాడతామన్నారు. బీసీ గర్జన సభ నిర్వాహణలో భాగంగా ఈనెల 19న సంగారెడ్డిలో, 21న కరీంనగర్ లో, 23న నిజామాబాద్ లో, 24న ఆదిలాబాద్ లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

బీసీ చాంపియన్స్ మేము అని మోడీ,కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, దమ్ముంటే వారు బీసీ జనాభా ప్రకారం చట్టసభల్లో 50 శాతం స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మోడీ బీసీ క్రిమిలేయర్ ఎత్తివేయమంటే ఎత్తివేయలేదన్నారు. బీజేపీ రిమోట్ కంట్రోల్ నాగ్ పూర్ లో వుందన్నారు. అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు ఎత్తి వేస్తామంటే కేసీఆర్, కుమారస్వామి ప్రశ్నించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు , ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపుకు వస్తారన్నారు.

Exit mobile version