Warangal | ప్రేమ పెళ్ళి చేశారని ఇండ్లకు నిప్పు.. నిందితుల అరెస్టు
Warangal సర్పంచ్ సహా 11 మంది అరెస్ట్ వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి కరుణాకర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రేమ వివాహం చేసారని యువకుడితో పాటు అతని స్నేహితుల ఇళ్ళకు నిప్పు పెట్టిన సంఘటనలో యువతి తండ్రి, సర్పంచ్ సహా 11 మంది నిందితులను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఇటుకలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు పాల్పడిన యువతి తరపు […]

Warangal
- సర్పంచ్ సహా 11 మంది అరెస్ట్
- వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి కరుణాకర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రేమ వివాహం చేసారని యువకుడితో పాటు అతని స్నేహితుల ఇళ్ళకు నిప్పు పెట్టిన సంఘటనలో యువతి తండ్రి, సర్పంచ్ సహా 11 మంది నిందితులను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఇటుకలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిందే.
ఈ సంఘటనకు పాల్పడిన యువతి తరపు బంధువులైన నిందితుల నుండి ఐదు ద్విచక్రవాహనాలు, పది సెల్ఫోన్లు, రెండు గొడ్డళ్ళు, మూడు వేటకోడవళ్ళు, కర్రలు, డీజిల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సర్పంచ్తో సహా 11 మంది నిందితులు
పోలీసులు అరెస్టు చేసిన వారిలో వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, ఇటుకాల పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ మండల రవీందర్, మండల రాజమౌళి, మండల శ్రీను, మండల రమేష్, మండల పైడి, మండల సదయ్య, మండలరాజు, మండల శివ, గడ్డల విష్ణు, మండల రాజు, మండల సదయ్య ఉన్నారు.
డీసీపీ కథనం ప్రకారం..
ఈ అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డిసిపి కరుణాకర్ వివరాలను వెల్లడిస్తూ వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, ఇటికాల పల్లి సర్పంచి మండల రవీందర్ కుమార్తె కావ్య హనుమకొండలో బీటెక్ చదువుతోంది. రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరు ఇద్దరు గతనెల 30న దేవాలయములో వివాహం చేసుకున్నారు.
దీన్ని జీర్ణించుకోలేని యువతి తండ్రి గ్రామ సర్పంచ్ అయిన మండల రవీందర్తో పాటు అతని తరుపు బంధువులు గత మంగళవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు రంజిత్ ఇంటితో పాటు ప్రేమ పెళ్ళికి సహకరించిన యువకుడి మిత్రుల ఇండ్లపై దాడులకు పాల్పడి నిప్పు పెట్టారు.
ఈ సంఘటనతో లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న నర్సంపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం సాయంత్రం నేరానికి పాల్పడిన నిందితులు నర్సంపేట శివారు ప్రాంతంలోని ఖానాపూర్ వెళ్ళే మార్గంలో ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నర్సంపేట ఏసిపి సంపత్రావు, ఇన్స్పెక్టర్ రమేష్ ఇతర పోలీస్ సిబ్బందిని డిసిపి కరుణాకర్ అభినందించారు.