Bihar Assembly Elections | పాట్నా : బీహార్( Bihar ) భగల్పూర్( Bhagalpur ) నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి అశ్విని చౌబే( Ashwini Choubey ) కుమారుడు అర్జిత్ శషావత్ చౌబే( Arjit Shashwat Choubey ) పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఆయన బీజేపీ( BJP ) నుంచి టికెట్ ఆశించినప్పటికీ, సాధ్యం కాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థి( Independent Candidate )గా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. దాంతో నిన్న తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు అర్జిత్ చౌబే రిటర్నింగ్ కార్యాలయానికి బయల్దేరారు.
అయితే నామినేషన్ దాఖలుకు కొద్ది క్షణాల ముందు.. మీడియాతో మాట్లాడుతుండగా ఆయన తన తండ్రి అశ్విని చౌబే నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నామినేషన్ వేయొద్దని, వెనక్కి తిరిగి రావాలని తండ్రి చెప్పడంతో ఆయన మాటను కాదనలేక కుమారుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక నామినేషన్ దాఖలు చేయకుండానే అక్కడ్నుంచి వెనుతిరిగారు. అర్జిత్ చౌబే యూటర్న్ నియోజకవర్గం ప్రజలతో పాటు ఆయన మద్దతుదారులను షాక్కు గురి చేసింది.
అనంతరం అర్జిత్ చౌబే మాట్లాడుతూ.. తన తండ్రి మాటకు గౌరవం ఇచ్చి నామినేషన్ దాఖలు చేయలేదన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నావు.. భవిష్యత్లో కూడా బీజేపీలోనే ఉంటావని తన తండ్రి చెప్పారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని ప్రకటించినప్పటి నుంచి బీజేపీ అగ్ర నాయకత్వం నాన్నపై ఒత్తిడి తెచ్చిందని తెలిపారు. ఇవాళ నాన్నతో పాటు అమ్మ కూడా తనతో మాట్లాడారని పేర్కొన్నారు. ఇక పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, పార్టీకి, తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్జిత్ చౌబే స్పష్టం చేశారు.