ఒడిశాలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడం ఇదే తొలిసారి. 24 ఏండ్ల నవీన్ పట్నాయక్ పాలనకు బీజేపీ బ్రేకులు వేసింది. ఇక నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ చరణ్ మాఝీని బీజేపీ శాసనసభాపక్ష నేతగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 12వ తేదీన ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్ దేవ్, ప్రవతి పరిదా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు.
ఎవరీ మోహన్ చరణ్ మాఝీ..?
చరణ్ మాఝీ గిరిజన నాయకుడు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. 11,577 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేడీ నాయకురాలు మైనా మాఝీని ఓడించారు. 2000, 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించి.. బీజేడీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఇక బీజేపీకి ఎంతో నమ్మకమైన వ్యక్తిగా పేరుగాంచారు. అంతేకాకుండా ఒడిశాలో బీజేపీ ఎదుగుదలకు చరణ్ మాఝీ ఎంతో కృషి చేశారు.
2023లో అసెంబ్లీలో స్పీకర్ పోడియంలోకి చరణ్ మాఝీ పప్పు విసిరేసి వార్తల్లో నిలిచారు. స్పీకర్ పోడియంలోకి పప్పు విసిరినందుకు ఆయనన సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే చరణ్ మాఝీ పోడియంలోకి పప్పు విసరలేదని, కేవలం స్పీకర్కు మాత్రమే అందించారని ఆయన స్నేహితుడు, ఎమ్మెల్యే ముకేశ్ చెప్పారు. మధ్యాహ్న భోజనం స్కీంలో భాగంగా పప్పు ధాన్యాల కొనుగోలులో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని అసెంబ్లీలో చరణ్ మాఝీ, ముకేశ్ వెల్లడించారు. ఆ కుంభకోణాన్ని ఎత్తి చూపేందుకు స్పీకర్ పోడియంలోకి పప్పును విసిరి నిరసన వ్యక్తం చేశారు.