ముంబై-పూణె ఎక్స్ప్రెస్ వేపై (Mumbai-Pune Expressway) భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic jam) ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్లోనే నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. ఈ ట్రాఫిక్కు కారణం గ్యాస్ ట్యాంకరే.
రాయ్ఘడ్ జిల్లాలోని అదోషి టన్నెల్ వద్ద ముంబై-పూణె ఎక్స్ప్రెస్ వేపై ఓ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆ వాహనం నుంచి భారీగా గ్యాస్ లీకైంది. అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. దీంతో దాదాపు 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. దాదాపు 18 గంటల పాటూ రహదారిపైనే పడిగాపులు కాశారు (vehicles stuck for 18 hours). ట్రాఫిక్లో చిక్కుకుపోయి తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక అల్లాడిపోయారు. వాష్రూమ్ సౌకర్యం కూడా లేక ఇబ్బందులు పడ్డారు. ఇక చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్న వారి అగచాట్లు వర్ణణాతీతం. పిల్లల ఆకలి, దప్పిక తీర్చేందుకు తల్లిదండ్రులు అగచాట్లు పడ్డారు. లారీ డ్రైవర్లైతే రోడ్డుపైనే వంటా, వార్పు చేసుకుని ఆకలి తీర్చుకున్నారు.
ప్రయాణికుల అగచాట్ల దృష్ట్యా అధికారులు వాహనాలను వేరే రూట్లో వెళ్లేలా ట్రాఫిక్ను మళ్లించారు. అయినా రద్దీ కొనసాగింది. ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ లీకవుతుండటంతోనే వాహనాలను ఆపాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిన్న సాయంత్రం మొదలైన ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
సమ్మక్క బెల్లాన్ని సర్కారు బడికి ఇవ్వండి…భక్తులకు వందేమాతరం ఫౌండేషన్ వినతి
Minister Staff Controversy | ఆ మంత్రి వద్ద.. సీఎం రేంజ్లో సిబ్బంది.. జీతాలూ ఘనంగానే!
