మనషులు కంటి చూపు కోల్పోవడం సాధారణమే. కంటి చూపు కోల్పోయిన వారు కంటి శుక్లం(క్యాటరాక్ట్) శస్త్ర చికిత్స చేయించుకుంటారు. ఆ శస్త్ర చికిత్స విజయవంతమైతే కంటి చూపును తిరిగి పొందుతారు. అయితే కంటి చూపు కోల్పోయిన ఓ కోతికి కూడా మనషులకు చేసినట్టే క్యాటరాక్ట్ సర్జరీ నిర్వహించారు. దీంతో కోతి కంటి చూపును తిరిగి పొందింది. అయితే కోతులకు కంటి శుక్లం శస్త్ర చికిత్సం చేయడం ఇదే తొలిసారి అని వైద్యులు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని హిస్సార్లో కొద్ది రోజుల క్రితం ఓ కోతి విద్యుత్ షాక్కు గురైంది. కాలిన గాయాలతో బాధపడుతున్న కోతిని జంతు ప్రేమికుడు మునీష్.. హిస్సార్లోని లాలా లజపత్ రాయ్ వెటర్నరీ యూనివర్సిటీకి తరలించారు. బాధిత కోతికి వెటర్నరీ వైద్యులు చికిత్స చేశారు. కొద్ది రోజులకు ఆ కోతి నడవగలిగింది. కానీ కోతి తన ముందున్న వస్తువులను సరిగా గుర్తించలేకపోయింది. దీంతో మళ్లీ కోతి కన్నులను పరిశీలించగా, రెండింటిలో శుక్లాలు ఏర్పడినట్లు గుర్తించారు. ఒక కన్ను పూర్తిగా డ్యామేజ్ అయింది. దీంతో మరో కన్నుకు క్యాటరాక్ట్ సర్జరీ నిర్వహించారు. మొత్తానికి ఆ వానరానికి చూపు వచ్చింది.
కంటిలో శుక్లాలు ఏర్పడడం అనేది సహజం. శుక్లాలు ఏర్పడడం ద్వారా కంటి చూపును కోల్పోతారు. దీన్ని గ్రహించకుండా ఉంటే.. కన్ను పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ముందుగానే గ్రహించి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకుంటే చూపును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.