Aishwarya Rai | 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఐశ్వర్యరాయ్. మెరిసే అందం, లావణ్యం, గ్రేస్తో ఇండియన్ సినిమా సిల్వర్ స్క్రీన్ను ఏలుతున్న నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ మూడు దశాబ్దాలుగా భారతీయ సినిమా గ్లోబల్ ఇమేజ్ను పెంచుతూ పోతుంది. ఐష్ మిస్ వరల్డ్ కిరీటం సాధించిన తర్వాతే భారతీయ అందాల పోటీల ప్రాధాన్యత పెరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
మిస్ వరల్డ్ నుంచి సూపర్ స్టార్డమ్ వరకు
మంగళూరులో జన్మించిన ఐష్, చదువుకుంటూనే మోడలింగ్ ప్రారంభించారు. 1994లో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచి ప్రపంచ వేదికపై భారత కీర్తిని పతాక స్థాయికి చేర్చారు. ఆ తర్వాత భారతీయ యువతులకు ప్రేరణగా మారారు. 1997లో తమిళ చిత్రం ఇద్దరుతో తెరంగేట్రం చేసిన ఆమె, అదే ఏడాది హిందీలో ఔర్ ప్యార్ హో గయా, తమిళంలో జీన్స్ సినిమాలతో వరుస విజయాలు సాధించి దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తర్వాత ధూమ్–2 షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్తో ప్రేమలో పడి 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో ఆరాధ్య జన్మించిన తర్వాత కొంత విరామం తీసుకున్నా, మళ్లీ పొన్నియన్ సెల్వన్ సిరీస్తో తన రేంజ్ ఏంటో చూపించారు.
అయితే 2024లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ (IIFA)లో ఐశ్వర్యరాయ్కి పొన్నియన్ సెల్వన్ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు లభించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా అందుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అవార్డు అందుకోవడానికి స్టేజ్ పైకి వెళ్లిన సమయంలో, బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది. అలానే అదే వేదికపైన మణిశర్మ కాళ్లకి కూడా నమస్కరించి బ్లెస్సింగ్ తీసుకుంది. ఇక ఈ రోజు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు సచిన్ తెండూల్కర్, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మోదీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్య రాయ్
వేదికపై అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. స్టేజ్పై కూర్చున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లిన ఐశ్వర్య రాయ్, మోదీ పాదాలకు వంగి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐష్ సింప్లిసిటీ, కల్చర్, ఒదిగే ఉండే మనస్తత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
