విధాత:బుధవారం రాత్రి హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఏపీలోనూ వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదైనాయి. మాదాపూర్లో 5సెంటిమీటర్లు, గచ్చిబౌలింలో 4.6 సెంటిమీటర్లు, చందానగర్లో 4.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది.తెలంగాణలోని సిద్దిపేట జిల్లా బెజగన్లో 12.2 సెంటి మీటర్లు, దుబ్బాక మండలంలోని పోతిరెడ్డిపేటలో 11.2 సెంటి మీటర్లు, కొండపాక, తిప్పారంలో 10.5 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. యాదాద్రిలో ఉదయం కురిసిన వర్షానికి బాలాలయంలోకి వర్షం నీరు చేరింది. భారీగా నీరు చేరడంతో బాలాలయం చెరువును తలపిస్తోంది. వర్షపు నీటిలోనే కుర్చీలు వేసుకుని అర్చకులు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని చిట్యాల, నార్కట్పల్లి, రామన్నపేట, నకిరేకల్, చుండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో పవర్ సప్లై నిలిచిపోంది.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో భారీ వర్షం నమోదైంది. వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. పలు చోట్ల వేరుశనగ పంట నీటమునిగింది.
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధి ఆళ్లగడ్డలో 73.4 మీల్లి మీటర్లు, కొలిమిగుండ్ల 72.2 మీల్లి మీటర్లు, దొర్ని పాడు 58.2 మీల్లి మీటర్లు, గొస్పాడు-49.0 మీల్లి మీటర్లు, ఉయ్యాలవాడ మీల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది.
విశాఖ ఏజెన్సీలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. మేదర సోల్లో పిడుగు పడి పెద్ద సంఖ్యలో పశువులు మృతి చెందాయి.విశాఖ ఏజెన్సీలో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అరకు, పాడేరు, హుకుంపేట తదితర ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసే సమయంలో పిడుగులు కూడా పడ్డాయి. ఆ క్రమంలో అరకు మండలం మెదర సొల గ్రామంలో పిడుగు పడి పెద్ద సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. చిత్తం గొంది గ్రామానికి చెందిన పశువులు కూడా మృత్యువాత పడడంతో యజమాని అప్పన్న కన్నీరు మున్నీరుగా రోదించాడు.