విధాత:ఇన్ఫోసిస్ INFOSYS ఇన్సైడర్ ట్రేడింగ్ వివాదంలో చిక్కుకుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలతో ఎనిమిది మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధించింది. వీరిలో ఇద్దరు INFOSYS ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరిపై రూ.3.06 కోట్ల జరిమానా విధించడంతోపాటు సెక్యూరిటీలను నేరుగా లేదా పరోక్షంగా కొనుగోలు చేయడం, అమ్మడం లేదా వ్యాపారం చేయకుండా సెబీ నిషేధించింది. గత ఏడాది (జూలై 15, 2020) ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగులోకి వచ్చింది.
సెబీ మే 31న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రభు భూత్రా, సీనియర్ ప్రిన్సిపల్ కార్పొరేట్ అకౌంటింగ్ గ్రూప్ వెంకట సుబ్రమణియన్ లను దోషిగా నిర్ధారించింది. గత ఏడాది ఇన్ఫోసిస్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపినట్లు సెబీ తెలిపింది. ఈ దర్యాప్తులో ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి వీరి మధ్య టెలిఫోన్ సంభాషణలను కనుగొన్నామని కూడా సెబీ వెల్లడించింది. ఈ దర్యాప్తులో క్యాపిటల్ వన్ పార్టనర్స్ భరత్ సీ జైన్, టెసోరా క్యాపిటల్, మనీష్ సీ జైన్, అమిత్ బుత్రాలను కూడా సెబీ దోషిగా తేల్చింది.
ఇన్ఫోసిస్ అధికారి వెంకట్ సుబ్రమణియన్ ధరల సమాచారాన్ని లీక్ చేసి ఉండవచ్చని సెబీ భావిస్తున్నది. భూత్రాతో సుబ్రమణియన్ నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు అందిన సమాచారం మేరకు విచారణ జరిపినట్లు సెబీ వెల్లడించింది. అటు జూన్ 1 న సెబీ నిషేధం విషయం తమ దృష్టికి వచ్చిందనీ, ఈ విషయంలో సెబీకి పూర్తిగా సహకరిస్తామనీ, అదనంగా, అంతర్గత దర్యాప్తును ప్రారంభించి, ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది.