విధాత: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆల్ ఇండియాలో శక్తి దూబే, హర్షిత గోయల్ తొలి రెండు ర్యాంకులు సాధించగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన సాయి శివానికి 11వ ర్యాంకు, బన్నా వెంకటేశ్ కు 15వ ర్యాంకు వచ్చింది. ఈ ఫలితాల్లో 1,009 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87మంది చొప్పున ఎంపికయ్యారు.
టాప్ 10 ర్యాంకర్లు వీరే
శక్తి దుబే, హర్షిత గోయెల్, డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్, ఆకాశ్ గార్గ్, కోమల్ పూనియా, ఆయుషి బన్సల్, రాజ్కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్ అగర్వాల్, మయాంక్ త్రిపాఠిలు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1,056 పోస్టుల భర్తీకి గతంలో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా, 1,009 మంది క్వాలిఫై అయ్యారని వెల్లడించింది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా 5లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన 14,627మందికి సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది.
శక్తి దుబే
మెయిన్స్లో రాణించిన 2,845మందిని జనవరి 7 నుంచి ఏప్రిల్ 17వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 42,560మంది ప్రిలిమినరీ పరీక్షలకు హాజరవ్వగా, 500మంది వరకు మెయిన్స్ కు అర్హత సాధించారు. అందులో 100మంది వరకు ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు.
శభాష్… సాయి శివాణి
వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయిశివాణి మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాలలో 11వ ర్యాంకు సాధించింది. అతి చిన్న వయస్సులో సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన రాజ్కుమార్ – రజిత ప్రథమ పుత్రిక ఇట్టబోయిన సాయిశివాణి చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తూ , దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్స్ ఫలితాల్లో అత్యుత్తమ ఘనతను సాధించింది. తెలంగాణ రాష్ట్రానికి, ఓరుగుల్లు నగరానికి, తన ప్రతిభతో గౌరవాన్ని ఇనుమడింప జేసిందని, యువతకు సాయి శివాణి ఒక ఆదర్శనీయమని పేర్కొంటూ శభాష్ సాయి శివాణి అంటూ అభినందించారు.
సాయి శివాణి