Ind vs NZ| పరువు దక్కించుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో మన స్పిన్నర్స్ కివీస్ బ్యాట్స్మెన్స్ని కాస్త ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ముంబై గ్రౌండ్లోను మణికట్టు మాయాజాలంతో వికెట్లు దక్కించుకుంటున్నాడు. వాంఖడే వేదికగా భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి సెషన్లో భారత్ మూడు వికెట్లు సాధించి తొలి సెషన్లో పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ను ఆకాశ్ దీప్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. తన తొలి రెండో ఓవర్లో డెవాన్ కాన్వే (4; 11 బంతుల్లో) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కివీస్ రివ్యూకి వెళ్లిన లాభం లేకపోయింది.
తొలి వికెట్ పడిన తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి విల్ యంగ్తో కలిసి కెప్టెన్ టామ్ లాథమ్ (28; 44 బంతుల్లో) ప్రయత్నించాడు. వీరిద్దరు రెండో వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వాషింగ్టన్ సుందర్ అద్బుతమైన బంతితో కుదురుకున్న టామ్ లాథమ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. సుందర్ వేసిన బంతి లాథమ్ డిఫెన్స్ను ఛేదించుకుంటూ ఆఫ్ స్టంప్ను తాకింది. కాసేపటికి రచిన్ రవీంద్ర (5; 12 బంతుల్లో) మరో అద్భుతమైన బంతితో సుందర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సిరీస్లో రచిన్ను ఔట్ చేయడం సుందర్కు మూడోసారి. ప్రస్తుతం క్రీజులో విల్ యంగ్ (38 నాటౌట్; 78 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), డారిల్ మిచెల్ (11 నాటౌట్; 21 బంతుల్లో) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో సుందర్ రెండు, ఆకాశ్ దీప్ ఒక్క వికెట్ తీశారు.
కాగా, లంచ్ విరామానికి న్యూజిలాండ్ ప్రస్తుతం 27 ఓవర్లకు 92/3 స్కోరు చేసింది. మూడో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం టీమిండియాకు ఎంతో ముఖ్యం..ఈ మ్యాచ్ గెలిస్తే మూడవ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ల ఫైనల్లోకి వెళ్లే దారులు తెరుచుకుంటాయి. ఇంకా ఆస్ట్రేలియాతో జరిగే సీరిస్లో 3 గెలవాలి.ఇక ఈ మ్యాచ్ కోసం బుమ్రాకి రెస్ట్ ఇచ్చి మళ్లీ సిరాజ్ని తీసుకున్నారు. సిరాజ్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు.