Site icon vidhaatha

Ms Dhoni| ఐపీఎల్‌లో ఆఖ‌రి మ్యాచ్ ఆడేసిన ధోని.. ఇక బ్యాట్ ప‌ట్ట‌న‌ట్టేనా?

Ms Dhoni| మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోని టీమిండియాకి దొరికిన ఆణిముత్యం. ఇండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించి పెట్టిన ధోని ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.. ప్ర‌స్తుతం ఐపీఎల్ తో పాటు ప‌లు క్రికెట్ లీగ్ ల‌లో ఆడుతూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. అయితే ఐపీఎల్ సీజ‌న్ 17కి ముందు ధోని త‌న కెప్టెన్సీని వ‌దులుకొని రుత్‌రాజ్ గైక్వాడ్‌ని కెప్టెన్ చేయ‌డం మ‌నం చూశాం. త‌న‌కి ఇదే చివ‌రి ఐపీఎల్ టోర్నీ కావ‌డంతో అలా చేసి ఉంటాడ‌ని అంద‌రు అనుకున్నారు. అయితే ధోని గ‌త రాత్రి ఆర్సీబీతో చివ‌రి మ్యాచ్ ఆడిన‌ట్టు స‌మాచారం అందుతుంది. లెజెండరీ క్రికెటర్​ మహేంద్ర సింగ్​ ధోనీ.. తన చివరి ఐపీఎల్​ మ్యాచ్​ ఆడేశాడా? అన్న ప్రశ్న అందరి మ‌తులు తొలిచేస్తుంది.

దీనికి ఇంకా సమాధానం దొరకలేదు కానీ.. ధోనీ రిటైర్​ అవ్వొద్దని మాత్రం చాలా మంది సోషల్​ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పైగా.. ఓటమితో ఐపీఎల్​ కెరీర్​ని ముగించవొద్దని సూచ‌న‌లు చేస్తున్నారు. ఈ ఏడాది చెన్నై ట్రోఫీ కొట్టి ఉంటే ధోని రిటైర్ అయిన పెద్ద‌గా బాధ‌ప‌డే వారు కాదు. కాని ప్లేఆఫ్స్‌కి చేర‌కుండా సీఎస్కే జ‌ట్టు టోర్నీ నుండి వైదొలిగింది. 2019 వరల్డ్​ కప్​ సెమీఫైనల్స్​.. ధోనీ చివరి ఇంటర్నేషనల్​ మ్యాచ్ ఆడ‌గా, అప్పుడు న్యూజిలాండ్​ చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆ త‌ర్వాత 2020 ఆగస్ట్​ 15.. ఇంటర్నేషనల్​ క్రికెట్​కి గుడ్​ బై చెబుతున్నట్టు ధోనీ ప్రకటించాడు. అయితే ధోనికి స‌రైన వీడ్కోలు ల‌భించ‌క‌పోవ‌డంతో చాలా మంది ఫ్యాన్స్ బాధ‌ప‌డ్డారు. ఇప్పుడు.. ఐపీఎల్​ 2024లో కూడా సీఎస్కే మాజీ సారథి ధోనీకి అలాంటి ప‌రిస్థితి ఎదురైంది.

అయితే చెన్నైలో చివ‌రి మ్యాచ్ ఆడి ఆ స‌మ‌యంలో క‌ప్‌ని త‌న టీమ్‌కి అందించాల‌ని ధోని కొరిక‌. కాని అది ఈ సీజ‌న్‌లో తీర‌లేదు. మరి ఇలాంటి స‌మ‌యంలో ధోని వచ్చే సీజ‌న్‌లో ఆడ‌తాడా, లేకుంటే ఆర్సీబీతో ఆడిన మ్యాచే ధోనికి చివ‌రిది కానుందా అని తెలియ‌రావ‌ల్సి ఉంది. ఐపీఎల్ 2024 లో చెన్నై ప్రయాణం ముగిసిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడనే ముచ్చ‌టించుకుంటున్నారు. అస‌లు ఈ సీజన్ ఆరంభం నుంచి ధోని రిటైర్మెంట్ గురించి చాలా చర్చలు జరిగాయి. కాని ఎక్కడ కూడా ధోని దీనిపై హింట్ ఇవ్వ‌లేదు. కాని విరాట్ కోహ్లీ మాత్రం సీఎస్కేతో మ్యాచ్ ఆడ‌క‌ముందు బ‌హుశా ధోనితో తాను మైదానంలో త‌ల‌డ‌డం ఇదే ఆఖ‌రి సారి కావొచ్చున‌ని అన్నాడు. జియో సినిమా ఇన్‌సైడ్ అవుట్ షోలో కోహ్లీ మాట్లాడుతూ.. దిగ్గ‌జ ఆట‌గాడు ధోనితో క‌లిసి తాను మ‌ళ్లీ ఆడే అవ‌కాశం ఉండొచ్చు, లేకుంటే ఇది చివ‌రిది కావొచ్చు. ఎవ‌రికి తెలుసు. అభిమానులు ఇలాంటి అంద‌మైన క్ష‌ణాలు త‌ప్ప‌క ఆస్వాదించాల‌ని తెలియ‌జేశాడు.

ఇక ధోని రిటైర్మెంట్ తీసుకోవ‌డానికి కొన్ని ప్ర‌త్యేక కార‌ణాలు ఉన్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి ధోనీ మోకాళ్ల సమస్యలతో బాధపడుతుండ‌డం మ‌నం చూశాం.. ఈ సమస్య కారణంగా ధోనీ టాప్‌లో బ్యాటింగ్ కి రావ‌డం లేదు. చివ‌ర్లో వ‌చ్చి మంచి షాట్సే ఆడుతున్నాడు. ఇక‌ రన్నింగ్‌లో మెరుపు వేగంతో వెళ్లే ధోనీ ఇప్పుడు ఇబ్బంది ప‌డుతున్నాడు.ఈ క్ర‌మంలో త‌ను రిటైర్మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని గ‌ట్టిగా భావిస్తున్నారు. గ‌తేడాది అత‌డి నాయ‌క‌త్వంలో చెన్నై కి ఐపీఎల్ క‌ప్‌ను అందించాడు. ఈ సీజ‌న్‌కు ముందే నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుని రుతురాజ్‌కు అందించ‌డంతో ధోనికి ఇదే ఆఖ‌రి సీజ‌న్ అని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే వీటన్నింటి మధ్య.. ‘డెఫినెట్లీ నాట్​ (కచ్చితంగా కాదు)’ అన్న పదం  ఇప్పుడు ట్విట్టర్​లో ట్రెండ్​ అవుతోంది. ‘ఇదే మీ చివరి సీజన్​ ఆ?’ అని ఐపీఎల్​ 2023లో ధోనీని అడగ్గా.. ‘డెఫినెట్లీ నాట్​’ అని అతను జవాబి ఇవ్వడం మనం చూశాం. ఈసారి కూడా ధోనీ రిటైర్​ కావొద్ద‌ని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. మరోవైపు, చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మాజీ సహచరుడు సురేష్ రైనా ఇద్దరూ ధోని మరో సీజన్ ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మ‌రి చూడాలి ధోని రానున్న రోజుల‌లో ఎలాంటి షాక్ ఇస్తాడా అనేది.

Exit mobile version