Site icon vidhaatha

IPL 2024 RCB vs CSK | చెన్నైని ఓడించి ప్లేఆఫ్స్​కు బెంగళూరు

ఓ అద్భుతం జరిగింది. దాన్ని టీవీల్లో, యాప్​లో చూసినవారు నిజమైన టి20 థ్రిల్​ను బ్రహ్మాండంగా అనుభవించారు. టి20 మ్యాచ్​లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇవాళ అలాగే జరిగింది. దాదాపు ప్లేఆఫ్స్​ రేసు నుండి తప్పుకుందనుకున్న రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు సవాలక్ష నిబంధనల మధ్య తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​(Chennai Super Kings)పై ఘనవిజయం సాధించి సగర్వంగా ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టింది. దాదాపు ఫైనల్​ రేంజ్​లో జరిగిన ఈ మ్యాచ్​ (High Voltage Match) ఈ సీజన్​కే హైలైట్​. జియో సినిమా యాప్​లో ఈ మ్యాచ్​ను 47 కోట్ల మంది వీక్షించారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్​ ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో.

టాస్​ గెలిచిన మద్రాస్​ టీమ్, బెంగళూరులోని వర్ష సూచనను దృష్టిలో ఉంచుకుని ఫీల్డింగ్​ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్​ను ధాటిగా ప్రారంభించింది. 3 ఓవర్లలో 31 పరుగుల స్కోరు ఉన్నప్పుడు వరుణుడు అడ్డుపడటంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. తిరిగి కాసేపటికి ప్రారంభమైన ఆట పిచ్​ తడిగా మారడంతో మందకొడిగా సాగింది. తరువాత జోరు పంజుకున్న ఓపెనర్లు కోహ్లీ, కెప్టన్​ డుప్లెసీ దంచి కొట్టారు. ముఖ్యంగా విరాట్​ వీరవిహారం చేసి 47 ( 3 ఫోర్లు, 4 సిక్స్​లు) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. తరువాత వచ్చిన రజత్​ పటీదార్​ కూడా జోరు మీదుండటంతో 11.2 ఓవర్లకే స్కోరు 100 పరుగులు దాటింది. కెప్టెన్​ ఔటయిన తర్వాత వచ్చిన కామెరున్​ గ్రీన్​ కూడా బ్యాట్​ ఝుళిపించడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. చివర్లో వచ్చిన మాక్స్​వెల్​, దినేశ్​ కార్తీక్​ కూడా చెరో చెయ్యి వేయడంతో స్కోరు 200 దాటి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగు భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో శార్దుల్​ ఠాకుర్​ 2 వికెట్లు, దేశ్​పాండే, సాంట్నర్​ చెరో వికెట్​ తీసుకున్నారు.

ఇప్పుడు ప్లేఆఫ్స్​ సమీకరణం ఎలా ఉందంటే, చెన్నై 201 పరుగులు చేసి ఓడిపోయినా, ప్లేఆఫ్స్​కు చేరుకుంటుంది. ఆలోపు ఔటయితే మాత్రం ప్లేఆఫ్స్​కు  బెంగళూరు బయలుదేరుతుంది.

అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యంతో ( గెలవడానికి 219 కావాల్సినా, ప్లేఆఫ్స్​కు కావాల్సింది 201. కాబట్టి చెన్నై లక్ష్యం 201) బరిలోకి దిగిన చెన్నైకి మొదటి బంతికే షాక్​ తగిలింది. కెప్టెన్​ రుతురాజ్​(0)  మాక్స్​వెల్​ వేసిన మొదటి ఓవర్​ తొలిబంతికే వెనుదిరిగాడు. వన్​డౌన్​లో వచ్చిన డారెల్​ మిచెల్​(4) ఆ వెంటనే ఔటయ్యాడు. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన చెన్నైని రచిన్​ రవీంద్ర(61), అజింక్య రహానే(33) ఆదుకున్నారు. వారు 66 పరుగులు జోడించి ఔటవడంతో క్రమం తప్పకుండా చెన్నై వికెట్లు కోల్పోయింది. ఆశలు పెట్టుకున్నశివం దూబే(7) అలా వచ్చి ఇలా వెళ్లగా, సాంట్నర్​(3)ను సిరాజ్​ బౌలింగ్​లో కెప్టెన్​ ఫాఫ్​ కళ్లుచెదిరే రీతిలో ఒంటిచేత్తో క్యాచ్​ పట్టి పెవిలియన్​కు పంపాడు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్​కు 35 పరుగులు అవసరం ఉన్న స్థితిలో క్రీజ్​లో ఉన్న జడేజా(), ధోనీ() కాసేపు పోరాడినా ఫలితం దక్కలేదు. చివరి ఓవర్​కు 17 పరుగులు అవసరమయ్యాయి. మొదటి బంతిని సిక్స్​ బాదిన ధోనీ(25) రెండో బంతికి ఔటయ్యాడు.  3వ బంతిని శార్దుల్​ వదిలేయగా, 4వ బంతికి ఒక పరుగు, 5,6 బంతులు జడేజాకు అందకుండా యశ్​ దయాల్​ తెలివిగా విసరడంతో చెన్నై 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ విధంగా ప్లేఆఫ్స్​కు 10 పరుగుల దూరంలో ఆగిపోయింది.

అనూహ్యరీతిలో, అద్భుత పోరాటపటిమ కనబరిచిన రాయల్​ చాలెంజర్స్​ తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. చివరికి 14 పాయింట్లతో, 0.459 రన్​రేట్​తో చెన్నైని అధిగమించి  ప్లే ఆఫ్స్​లోకి ఆఖరి టీమ్​గా ప్రవేశించారు. ఈ విజయంతో ఆర్సీబీ జట్టు సభ్యులు కప్​ సొంతం చేసుకున్నంత సంబరాలు చేసుకున్నారు. తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. స్టేడియంలో ఉన్న ఎంతోమంది అభిమానులతో పాటు కోహ్లీ, ఆయన భార్య అనుష్క ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

రేపు జరిగే రెండు ఆఖరు లీగ్​ మ్యాచ్​లతో ప్లేఆఫ్స్​లో 2,3,4 స్థానాలు ఎవరివో ఖరారవుతాయి

Exit mobile version