విధాత, హైదరాబాద్ : పార్టీ ఎమ్మెల్యేల వరుస ఫిరాయింపులతో సతమతమవుతున్న బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరో బిగ్ షాక్ నిచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం స్వయంగా కేసీఆర్ నిర్వహించిన బీఆరెస్ ఎల్పీ సమావేశానికి ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు గైర్జాజరవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఈ భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆరెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్లోకి పోయిన ఎమ్మెల్యేలు పోగా, మిగిలిన 28 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలలో ఐదుగురు ఈ భేటీకి డుమ్మా కొట్టారు. జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్య రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ళ పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకటరామిరెడ్డి, గోరేటి వెంకన్న, వెంకట్రామ్రెడ్డిలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. బీరెస్ ఎల్పీ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముందుగానే అందించినప్పటికీ వీరు హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ మారే క్రమంలోనే వారిలో కొందరు ఈ సమావేశానికి గైర్హాజరైనట్లుగా ప్రచారం జోరందుకుంది. మరోవైపు బీఆరెస్ ఎల్పీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆరెస్ అనుసరించాల్సిన వ్యూహాలను ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా, నిరుద్యోగుల ఆందోళన, రూ.2 లక్షల రుణమాఫీకి నిబంధనలు విధించడం, ఆరు గ్యారెంటీల అమలు వంటి అంశాలను హైలెట్ చేస్తూ సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని నేతలకు కేసీఆర్ సూచించారు.