థేమ్స్ పోలిక వెనుక థీమ్స్ ఏంటీ
సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ ప్రశ్న
తట్టెడు మన్ను తీయకముందే కోట్లు తన్నుకుపోయే కుట్ర
కాంగ్రెస్ ధన దాహానికి సజీవ సాక్ష్యమని ధ్వజం
విధాత, హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అంచనాలను పెంచడాన్ని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. మూసీ ప్రక్షాళన అంచనాల పెంపు వెనుక మతలబు ఏమిటని, లండన్లోని థేమ్స్ నది లాగా మారుస్తామనడం వెనుకున్న థీమ్ ఏంటి..గేమ్ ప్లాన్ ఏంటని ప్రశ్నించారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న 50 వేల కోట్లు అయితదని, నిన్న 70 వేల కోట్లు వెచ్చిస్తామన్నరని, నేడు లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని, మరి.. సుందరీకరణకే రూ.లక్షా యాభై వేల కోట్లా..! పదిహేను పక్కన ఇన్ని సున్నాలా..!! 15,000,000,000,000 అంటూ ఎద్దేవా చేశారు. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందురు..నిల్వ ఉంచే టీఎంసీలెన్ని సాగులోకి వచ్చే ఎకరాలెన్ని పెరిగే పంటల దిగుబడి ఎంత, తీర్చే పారిశ్రామిక అవసరాలెంత అని కేటీఆర్ నిలదీశారు.
మూసీని అందంగా
ముస్తాబు చేసేందుకు..మొన్న..
50 వేల కోట్లు అయితదన్నరునిన్న..
70 వేల కోట్లు వెచ్చిస్తామన్నరునేడు..
లక్షా 50 వేల కోట్లు
ఖర్చు చేస్తామంటున్నరుతెలంగాణ రైతుల తలరాతను మార్చిన
కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే
గల్లీ నుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది… pic.twitter.com/DpiqFewWee— KTR (@KTRBRS) July 21, 2024
కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని అని ప్రశ్నించారు. పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి గారికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ అని నిలదీశారు. చివరిదశలో ఉన్నఆ ప్రాజెక్టును పక్కనపెట్టి.. కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం అని ప్రశ్నించారు. లండన్ లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటి సీఎం గారు అంటూ ప్రశ్నించారు.
మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యమని, మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందేనని, సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాల్సిందేనని, కానీ మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించబోమని, తట్టెడు మన్ను తీయకముందే.. కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించబోమని, “మూసీ రివర్ ఫ్రంట్” పేరిట బ్యాక్ డోర్ లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందని, కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెడుతుందని కేటీఆర్ తన ట్వీట్లో హెచ్చరించారు.