విధాత: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆరు నెలల్లోనే ఐదు సంవత్సరాల అపఖ్యాతిని మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సన్నాయినొక్కులు నొక్కుతున్నదని ఆరోపించారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికతో ప్రభుత్వాలేమీ మారిపోవు. కానీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నించేవాళ్లు శాసన సభలో, మండలిలో ఉండాలన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రజల పక్షాన గొంతు విప్పే వాళ్లు కావాలన్నారు. అందుకే రాకేశ్రెడ్డి ని గెలిపించాలని కోరారు. గతంలో క్వింటాల్ వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని మంత్రులు చెబుతున్నారు. దీనిపై రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలంటే అక్కడ విద్యావంతుడికి అవకాశం ఇవ్వాలన్నారు.