నెల రోజుల ప్రస్థానం సంతృప్తినిచ్చింది : సీఎం రేవంత్ రెడ్డి

నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ట్వీట్‌ చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం

  • Publish Date - January 7, 2024 / 08:01 AM IST

విధాత : నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ట్వీట్‌ చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తి నిచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు.

పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని వివరించారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని చెప్పారు.

రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు.