విధాత : హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రభాకర్ మృతిపై పలువురు మంత్రులు స్పందించి.. విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిపై సీరియస్గా స్పందించడంతో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సామాజిక మాధ్యమాల్లో రైతు ప్రభాకర్ ఆత్మహత్య వీడియో వైరల్గా మారడం..ప్రతిపక్ష బీఆరెస్ రాజకీయ దాడి సాగిస్తుండటంతో ప్రభుత్వం స్పందించక తప్పలేదు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దటూరుకు చెందిన ప్రభాకర్ అనే రైతు తన భూమిని కొందరు కబ్జా చేశారని.. పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదనతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ కావడంతో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.