హైదరాబాద్ : బీఆర్ఎస్ హయాంలో రైతును రాజు చేయలేదు.. కానీ అప్పుల పాలు చేసింది అని నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయమైన నిర్ణయాలతో రైతుల నడ్డి విరిచింది.. నట్టేట ముంచింది అని వేముల వీరేశం నిప్పులు చెరిగారు. శాసనసభలో వ్యవసాయం పద్దుపై చర్చ సందర్భంగా వీరేశం మాట్లాడారు.
వ్యవసాయం చేసుకోవాలంటే నాటు పెట్టే సమయానికి 8 వేల వరకు ఖర్చు వస్తది. ఎరువులకు 3 వేల చిల్లర ఖర్చు వస్తది. రైతుబంధు కింద ఐదు వేలు ఇచ్చి రైతును రాజు చేస్తున్నట్లుగా డంబాచారం కొట్టారు తప్ప రైతులకు ఏం ఒనగూరలేదు. గడిచిన బీఆర్ఎస్ పాలనలో చాలా సంస్కరణలు, అద్భుతాలు తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దొడ్డు వడ్లు వేయొద్దు అంటే సన్న వడ్లు వేస్తే వాటిని కొనే నాథుడు లేడు. రైతులు ఏడ్చారు. బీఆర్ఎస్ మాటలు నమ్మి పత్తికి బదులుగా కందులు, పెసర్లు వేశారు. వాటిని కూడా కొనే నాథుడు లేక రైతులు విలవిలలాడిపోయారు. అదే ఏడాది పత్తికి మార్కెట్లో రేటు పెరిగింది అని వీరేశం గుర్తు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగాన్ని రక్షించుకోవాలని, అన్ని విధాలా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారు. 75 వేల కోట్లు వ్యవసాయానికి కేటాయించారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. గత 10 ఏండ్లలో రుణమాఫీ పేరు చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ రుణమాఫీ జరగలేదు. వడ్లు అమ్ముకున్న పైసలు రైతులు బ్యాంకుల్లో దాచి పెట్టుకుంటే బ్యాంకర్లు రుణమాఫీ కింద ఆ డబ్బులను కట్ చేసుకున్నారు. రైతుబంధుతో రైతాంగం, రుణమాఫీతో గొప్పగా బతికి ఉంటే.. అదే పార్టీ గెలిచేది. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచేది. ఇప్పటికే లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి. మరి కొద్ది గంటల్లో లక్షన్నర లోపు రుణాలు మాఫీ కాబోతున్నాయి. రైతు ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. మాది రైతు ప్రభుత్వం. రైతులు బీఆర్ఎస్ హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని వీరేశం తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో హమాలీ చార్జిలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ చార్జిలను కూడా రైతులన భరించరు. రైతులకు రుణమాఫీ ఇవ్వడంతో పాటు కూలీలకు 12 వేలు ఇస్తామన్నారు. దాన్ని అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వంగా ముందుకు పోతున్నాం. రైతుల ఆశలకు అనుగుణంగా మా పాలన ఉంటుంది. రేవంత్ నిర్ణయాలతో రైతులు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహిస్తది.. వ్యవసాయం చేసుకోవచ్చని రైతులు అనుకుంటున్నారు అని ఎమ్మెల్యే వీరేశం పేర్కొన్నారు.