* కారుణ్య నియామకాల వయోపరిమితి (ఏజ్ లిమిట్) పెంచుతూ నిర్ణయం
* కార్యరూపం దాల్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ
హైదరాబాద్: సింగరేణి కార్మిక కుటుంబాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న కారుణ్య నియామకాల వయో పరిమితి పెంపు కార్యరూపం దాల్చింది. సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అకాల మరణం చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి, అనారోగ్యంతో (మెడికల్ అన్ఫిట్) ఉద్యోగ విరమణ చేసిన వారి పిల్లలను బదిలీ కార్మికునిగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలోకి తీసుకుంటారు. గతంలో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారినే కారుణ్య నియామకాల కింద తీసుకునే వారు. కరోనా కాలంలో రెండేళ్ల పాటు వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంతో సింగరేణి కార్మికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారుణ్య నియామకాల వయో పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కారుణ్య నియామకాల వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. వయో పరిమితి సడలిస్తూ ఇచ్చిన ఉత్తర్వును 2018, మార్చి 9వ తేదీ నుంచి అమలు చేస్తారు. ప్రస్తుత ఉత్తర్వుతో సింగరేణిలో వందలాది కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.