– నల్గొండ లేదా భువనగిరి నుంచి పోటీ
– ఈ సంక్రాంతి రైతులకు అనుకూలంగా లేదు
– శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ లేక భువనగిరి ఏదో ఒక నియోజకవర్గ నుండి ఎంపీగా పోటీ చేస్తారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా పనిచేసినప్పుడు ఉమ్మడి జిల్లాలోని దాదాపుగా అన్ని అసెంబ్లీలు తమ పరిధిలోకి వచ్చాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలు గెలుస్తామని అనడం సహజమన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థను అయినా చులకనగా చూడరాదని, సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలిపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాజకీయాలు తెలంగాణలోకి రావద్దని తాను కోరుకుంటున్నాను అని అన్నారు.
ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలు సరికావన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల పరిపాలనపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని అన్నారు. ఏ ప్రభుత్వమైనా మంచి చేస్తే స్వాగతిస్తామని ఆయన అన్నారు. వచ్చే వేసవిలో మంచినీటి సమస్య అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆ విషయంలో చొరవ చూపాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. మిషన్ భగీరథ పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. మిషన్ భగీరథ లో కాంట్రాక్టర్లు చేసిన పనులకు పేమెంట్లు కూడా త్వరగా చెల్లించాలన్నారు. ఈ సంక్రాంతి రైతులకు అనుకూలంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు లేదని, ఏఎంఆర్పీకి నీరు రావడంలేదని, ఈ సంవత్సరం ప్రతి పంట బాగా దెబ్బతిన్నదని అన్నారు.