విధాత : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45రోజులవుతున్నా అభివృద్ధి పనులను గాడిన పెట్టలేకపోతుందని, వంద రోజుల సమయం గడవకపోవడంతో ఓపిక పడుతున్నామని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చీల్చి చెండాడేవాళ్లమని బీఆరెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, హామీల అమలు సంగతేమిటని బీఆరెస్ ప్రశ్నిస్తే కాకమ్మ కథలు చెబుతున్నారని, లేనిపోని విషయాలు తెరపైకి తెస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి 3.50లక్షల కోట్ల రూపాయలు కావాలని, మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల 90 వేల కోట్లు మాత్రమేనని, బడ్జెట్ కన్నా మించి హామీలిచ్చారన్నారు. ఎలాగూ అధికారం రాదు కదా అని అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను రాసేశారన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని, 5 గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని కర్ణాటక ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి తాజాగా మీడియాతో అన్నారన్నారు. గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందని ఆయన హెచ్చరించారని, మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం ప్రకటించి బీఆరెస్ను బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, అడ్డగోలు హామీలిచ్చి వాళ్లు తీసుకున్న గోతీలో వాళ్లే పడ్డారన్నారు. ప్రజాస్వామ్యం లో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదని, ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కాలంలో ప్రభుత్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాల కాల పరిమితి ఐదేళ్లే
రాజస్థాన్లో ఐదేళ్లకే ప్రభుత్వం మారిందని, ఛత్తీస్ ఘడ్ లో కూడా ఐదేళ్లకే మారిందని, ఇట్లా ప్రభుత్వాలు మారడం దేశంలో కొత్తేమి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదన్నారు. ఐదేళ్ల లోపే ప్రజావ్యతిరేకతను మూట గట్టుకుని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశంలో ఎక్కువన్నారు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడిందన్నారు. దేశం లో పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానానికి చేరిందంటే ఇది కేసీఆర్ ఘనతేనన్నారు. తెలంగాణ కన్నా ముందున్న రాష్ట్రాలు తమిళ నాడు, కేరళ మాత్రమేనన్నారు. సంక్షేమం తో పాటు అభివృద్దిని కేసీఆర్ జోడు ఎడ్లలా కొనసాగించబట్టే గత పదేళ్ల లో తెలంగాణ పేదరికం 83 శాతం తగ్గిందన్నారు. తెలంగాణ పేదరికం 3 శాతం ఉంటే ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పేదరికం 9 శాతం ఉందన్నారు. నీతి ఆయోగ్ నివేదిక తోనైనా కాంగ్రెస్ నేతలు నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ చెబుతున్న కాంగ్రెస్ పాలకులు దావోస్ కు వెళ్లిన సీఎం బృందం రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పి పెట్టుబడులకు రావొద్దు అని చెప్పదలుచుకున్నారా అని నిలదీశారు. దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షంలో ఉండగా మంత్రి ఉత్తమ్ అన్నారని, మరి ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యారాజకీయాలు మొదలుపెడుతోందని, ఇది మంచిది కాదన్నారు.
కూల్చే..చీల్చే కుట్రలన్ని బీజేపీకే సొంతం
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బ్రహ్మజ్ఞాని బండి సంజయ్ చెబుతున్నారని, ఆయన మాటాల్లోనే కాంగ్రెస్ బీజేపీల మైత్రిని బహిరంగంగా ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర, పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీ దేనన్నారు. బీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారన్నారు. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా బండి సంజయ్ తీరు ఉందని హరీశ్రావు విమర్శించారు. బండి సంజయ్ లొట్ట పిట్టలా వార్తల్లో ఉండేందుకు ప్రచారం కోసం తాపత్రయ పడతారన్నారు. కరీం నగర్ కు ఒక్క రూపాయి తేనోడు అడ్డమైన విషయాలు అడ్డం పొడువు మాట్లాడుతున్నాడన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసిందని, కాంగ్రెస్ మేనిఫెస్టో లో 111 వ హామీ కింద పాలమూరు కు జాతీయ హోదా తెస్తామని చెప్పిందని ఇప్పుడేం చేస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేది పోయి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ప్రతి రోజూ బీజేపీ నాయకుల మెడలకు దండలు వేస్తున్నారన్నారు.
బీఆరెస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం
పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారమని, విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. ఈ కీలక సమయంలో బీఆరెస్ ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టమన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడినం.. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డామన్నారు. మన పార్టీ స్థానం మారిందని, పాలన నుంచి ప్రతి పక్షానికి వచ్చామని, అయినా అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాలకతీతంగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారని, ఇది ఎవరూ కాదనలేని సత్యమన్నారు. సాంప్రదాయ రాజకీయపద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉండటంతో కొంత నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠంగా నేర్చుకుని ముందుకు సాగుదామని పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. మనం ఉద్యమ వీరులం కార్య శూరులం.. ఉద్యమానికి ఊపిరి లూదిన వాళ్ళం..పేగులు తేగే దాకా మన మాతృ భూమి కోసం కొట్లాడిన వాళ్ళం.. మనకు సత్తువ ఉంది.. సత్తా ఉంది ప్రతిపక్షంలో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదామన్నారు. కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని, పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే పని చేస్తుందన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత నెల రోజులకే సమీక్ష, సన్నాహక సమావేశాలు ప్రారంభించామని, ఇప్పటి దాకా జరిగిన అన్ని సమావేశాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువగా విలువైన సూచనలు వచ్చాయన్నారు. కొన్ని రోజులైతే బీఆరెస్ నేతలు ఇంట్లో కూర్చున్నా.. రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారన్నారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ఎంపీ పి. రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.