విధాత, హైదరాబాద్ : తాను జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా, పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యల పూర్తికి ప్రభుత్వ నిధుల సాధన కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్పష్టం చేశారు. మంగళవలారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా ఎవరెన్ని విమర్శలు చేసినా ఇదే నిజమన్నారు. తన నియోజవర్గంలో ఇప్పటి వరకు 4,300 ఇళ్లను పూర్తి చేశామని తెలిపారు. ఆ ఇళ్లకు మౌలిక వసతులు కల్పనకు నిధులు అవసరమయ్యాయన్నారు. గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయత్రం రూ.32 కోట్ల 16 లక్షలు నిధులు మంజూరు చేస్తూ జీవో కూడా జారీ చేశారని పేర్కొన్నారు. తన పార్టీ మార్పు ఫలితానికి ఇదే నిదర్శనమన్నారు. నియోజకవర్గానికి మరికొన్ని ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధికి సీఎం హామీ ఇచ్చారని అన్నారు. రైతు సమస్యలపై రేవంత్ ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందన్నారు. రేవంత్రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి జరగుతుందనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా పునరుద్ఘాటించారు. తనది పూర్తి స్థాయి రాజకీయ కుటుంబముని, తన రక్తంలోనే పాలిటిక్స్ ఉన్నాయని అన్నారు. తన చిన్న తాత మాకునూరు శ్రీరంగరావు మొట్టమొదటి పార్లమెంట్ కాంగ్రెస్ సభ్యులని గుర్తు చేశారు. నన్ను ఎమ్మెల్యేగా రెండుసార్లు వరుసగా గెలిపించిన నియోజకవర్గం ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ముందుకెలుతానన్నారు.