హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీలో తిరుగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. శంషాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులను పోలీసుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తోందని కేంద్ర మంత్రి మండిపడ్డారు. రాహుల్ గాంధీని సొంత పార్టీ వారే ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేదన్నారు. ప్రజలకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆ పార్టీ విఫలమైందన్నారు. నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోంది తెలంగాణలో మాత్రమేనన్నారు. దేశానికి ‘మోదీ’యే గ్యారంటీ అని లోక్సభ ఎన్నికల ద్వారా తెలంగాణ ప్రజలు నిరూపించారని, 8 ఎంపీ స్థానాలు గెలిపించిన ‘తెలంగాణ ప్రజలకు’ నా సెల్యూట్ అన్నారు. ప్రధాని కాగానే కిసాన్ సమ్మాన్ నిధిపై సంతకం చేసిన నేత మోదీ అని, కాంగ్రెస్ వంద రోజుల్లో అమలు చేస్తామన్నఆరు గ్యారంటీలు ఏడు నెలలైన అమలు కావడం లేదని, జాబ్ క్యాలెండర్, పింఛన్ల పెంపు, రైతు భరోసా, రుణమాఫీ పెండింగ్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు. కాంగ్రెస్ను ప్రజలు వ్యతిరేకించారనటానికి లోక్సభ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో ప్రజలు తేల్చేశారన్నారు. కార్యకర్తల కష్టార్జితంతోనే మేం గెలిచామని, తెలంగాణలో ఈసారి బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు పెద్ద పీఠ వేస్తుందన్నారు. స్వయంగా కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపుతున్నారన్నారు. అవినీతి నుంచి బయట పడేందుకు కాంగ్రెస్కు కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. రైతులను మోసం చేసే విషయంలో బీఆరెస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు.
Bandi Sanjay | రాహుల్ గాంధీకి దమ్ముంటే ఓయూలో తిరుగాలి ,నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోంది తెలంగాణలోనే : బండి సంజయ్
