విధాత, వరంగల్: నిలువ నీడలేని ప్రజల కోసం ఇంటి బంధు పథకం ప్రవేశపెట్టి పది లక్షల రూపాయల సహాయం అందించాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు.
భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ జిల్లా ప్లీనరీ సమావేశం గడ్డం నాగార్జున, మంద రవి, ఎండి రాజా సాహెబ్ అధ్యక్షతన వరంగల్లోని ఓంకార్ భవన్ లో మంగళవారం ప్లీనరీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాదగోని రవి మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆశయాలతో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న స్వరాష్ట్రంలో నిలువ నీడలేని పేదలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు.
పేదలకు చెందాల్సిన వివిధ రకాల ప్రభుత్వ భూములు అధికార పార్టీ అండదండలతో కబ్జాలు చేస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టకుండా కేవలం అర్హులకు మూడు లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడం సరైంది కాదని అన్నారు.
దళిత బంధు, రైతుబంధు ప్రవేశపెట్టిన విధంగానే పేద ప్రజల కోసం ఇంటి బంధు పథకాన్ని ప్రవేశపెట్టి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని కోరారు. ఇంటిబంధు సాధన కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా పోరాటాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.
సమావేశానికి కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న, వనం సుధాకర్, కుంభం సుకన్య, వస్కుల మట్టయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ రెడ్డి హంసారెడ్డి, పెద్దారపు రమేష్, కన్నం వెంకన్న, జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి, కేంద్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు నర్ర ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగేల్లి కొమురయ్య, మాలి బాబురావు, వంగల రాగసుధ, కనకం సంధ్య, సుంచు జగదీశ్వర్, కొత్తకొండ రాజమౌళి, ఎండి స్మైల్, కేశెట్టి సదానందం, జన్ను రమేష్, గుగులోత్ అరుణ్, కుమారస్వామి లతోపాటు జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.